CM Revanth Reddy : యుద్ధం చేయండి.. పీవోకే ను స్వాధీనం చేసుకోండి.. అంటూ ఆపరేషన్ సిందూర్ సమయంలో ప్రధాని మోదీకి కాంగ్రెస్ పార్టీ మద్దతుగా నిలిచిందని చెప్పారు సీఎం రేవంత్రెడ్డి. కానీ, ఎవరు లొంగ దీసుకున్నారో.. ఎవరికి భయపడ్డారో తెలియదు.. 4 రోజుల తర్వాత యుద్ధాన్ని ఆపేశారని అన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పారని యుద్ధం నిలిపివేశారా? మరి, యుద్ధ విరమణ చేసే ముందు ఎందుకు అఖిలపక్షం అభిప్రాయం తీసుకోలేదని ప్రశ్నించారు. గుండెల్లో ధైర్యం ఉన్న నాయకుడే యుద్ధ తంత్రాన్ని నడిపించగలడన్నారు రేవంత్. దేశ భద్రత విషయంలో సైన్యానికి మనమంతా అండగా ఉండాలని పిలుపు ఇచ్చారు.
ఆ లెక్క చెప్పండి..
తెలంగాణలో తయారు చేసిన యుద్ధ విమానాలే.. దేశం పరువు నిలబెట్టాయని అన్నారు సీఎం రేవంత్రెడ్డి. మన దేశాన్ని కాదని… విదేశాల నుంచి మోడీ తెచ్చిన రాఫెల్ యుద్ధ విమానాలను పాకిస్తాన్ కూల్చేసిందన్నారు. ఎన్ని రాఫెల్ యుద్ధ విమానాలను పాక్ నేల కూల్చిందో కూడా బీజేపీ చెప్పడంలేదన్నారు. గొప్పల కోసం.. కావాల్సిన వారి కోసం.. వేల కోట్లు పెట్టి రాఫెల్ యుద్ధ విమానాలు కొన్నారని ఆరోపించారు.
ఇందిరమ్మ స్పూర్తితో..
చైనా, పాక్లు.. భారత్ వైపు చూస్తే గుడ్లు పీకి గోళీలు అడుతాం అని ఆనాడు ఇందిరమ్మ చెప్పిందని గుర్తు చేశారు. 1971లో పాకిస్తాన్కు సపోర్ట్గా వచ్చిన అమెరికాను హెచ్చరించిన ఉక్కు మహిళ ఇందిరగాంధీ అని చెప్పారు. ఆనాటి యుద్ధంలో ఇందిరమ్మ.. పాక్ను రెండు ముక్కలు చేసి చూపించారు.. ఇందిర స్ఫూర్తితో దాయాది దేశాన్ని ఇప్పుడు మళ్లీ రెండు ముక్కలు చేయాలని.. అందుకు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్గా ఉంటుందని పిలుపు ఇచ్చారు సీఎం రేవంత్రెడ్డి. మన ఆర్మీ జవాన్ కల్నల్ సంతోష్ను చైనా పొట్టన పెట్టుకుంటే మోదీ కనీసం చైనాకు బుద్ధి చెప్పే ప్రయత్నం కూడా చేయలేదని మండిపడ్డారు.
చైనా, పాక్లను ఓడిస్తాం..
దేశ ప్రజలంతా వీరతిలకం దిద్ది యుద్ధం చేయమంటే.. ట్రంప్ చెప్పాడని మోదీ యుద్ధం విరమించారని.. మరి, బీజేపీ నేతలు దేనికోసం తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నారని నిలదీశారు. పహల్గాం ఘటన తర్వాత మొదటగా తెలంగాణలోనే ర్యాలీ చేశామని గుర్తు చేశారు. యుద్ధం మీ సొంత వ్యవహారం కాదని.. దేశ భద్రత అంశంమన్నారు. దేశ భద్రతను మోదీ ప్రభుత్వం ట్రంప్ దగ్గర తాకట్టు పెట్టిందన్నారు. భారత సైనికుల ఆత్మస్థైర్యాన్ని బీజేపీ దెబ్బతీస్తే.. వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు కాంగ్రెస్ జైహింద్ యాత్ర చేపట్టిందని చెప్పారు. మోడీ రద్దైన వేయి రూపాయల నోటు, చెల్లని అర్థ రూపాయి లాంటి వారని అన్నారు. రాహుల్ గాంధీ దేశ ప్రధాని అయితే.. పీవోకేను భారత్లో కలుపుతారని అన్నారు సీఎం రేవంత్.
Also Read : కేసీఆర్ ఎటు వైపు..?
పహల్గాం ఉగ్రవాదులు ఎక్కడ?
హైదరాబాద్, బాచుపల్లిలో జైహింద్ ర్యాలీ నిర్వహించింది కాంగ్రెస్ పార్టీ. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఏఐసీసీ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ మాట్లాడారు. పహల్గాం ఘటనకు కారణం అయిన ఉగ్రవాదులను ఇప్పటి వరకు ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నించారు. తీవ్రవాదులు ఎక్కడున్నారనే సమాచారం ఎందుకు కేంద్ర ప్రభుత్వం సేకరించ లేకపోతోందని తప్పుబట్టారు. ఉగ్రవాదుల ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను పరామర్శించే సమయమే మోదీకి లేదని మండిపడ్డారు. అనేక మంది కాంగ్రెస్ పెద్దలు దేశం కోసం ఆత్మ బలిదానం చేశారని గుర్తు చేశారు మీనాక్షి.