CM Revanth Reddy: మహిళలకు రక్షణ కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ ఐసీసీసీ (ICCC) వేదికగా చిన్నారులు, మహిళల భద్రత కోసం హైదరాబాద్ పోలీసులు నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో మహిళలు, పిల్లలకు రక్షణ కల్పించడాన్ని ప్రభుత్వాలు ప్రాథమిక బాధ్యతగా భావిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఏ దేశంలోనైతే వీరికి భద్రత ఉంటుందో అక్కడ అభివృద్ధి వేగంగా జరుగుతుందని స్పష్టం చేశారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే మహిళలకు ఓటు హక్కు కల్పించిన ఘనత మన దేశానిదని గుర్తు చేశారు. అమెరికా వంటి అగ్రరాజ్యంలో మహిళలకు ఓటు హక్కు రావడానికి 150 ఏళ్లు పట్టిందని వివరించారు. దేశాభివృద్ధిలో మహిళలకు పురుషులతో సమానంగా తొలి ప్రధాని నెహ్రూ హక్కులు కల్పించారని కొనియాడారు.
మహిళల రక్షణ కోసం ఇప్పటికే షీ టీమ్స్ (She Teams) పనిచేస్తున్నాయని సీఎం తెలిపారు. అభద్రతకు గురైన వారికి అండగా నిలబడేందుకు ‘స్టాండ్ విత్ హర్’ (Stand With Her) కార్యక్రమాన్ని ప్రవేశపెట్టామన్నారు. మరో అడుగు ముందుకేసి 24 గంటల పాటు అందుబాటులో ఉండే ‘స్పందన’ టీమ్స్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఈ టీమ్స్ ద్వారా బాధితులకు తక్షణమే మానసిక భద్రత కల్పిస్తారని చెప్పారు. సమస్య వచ్చినప్పుడు ప్రభుత్వం పక్కన ఉంటుందన్న విశ్వాసాన్ని కల్పిస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. సమస్యలు రాకుండా చూడాల్సిన సామాజిక బాధ్యత అందరిపైనా ఉందని హితవు పలికారు.
ప్రభుత్వ ప్రతి సంక్షేమ పథకంలో మహిళలకే ప్రాధాన్యత ఇస్తున్నామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్లను మహిళల పేరుతోనే మంజూరు చేస్తున్నామన్నారు. మహిళలకు ఆర్థిక స్వాలంబన లభించినప్పుడే కుటుంబం సమాజంలో నిలబడుతుందని నమ్మారు. రాష్ట్రంలోని 67 లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు 60 వేల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను అందజేశామన్నారు. కోటి మంది మహిళలకు సారె పేరుతో ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశామని చెప్పారు. గత 28 నెలల్లో మహిళల ఉచిత బస్సు ప్రయాణం కోసం ప్రభుత్వం 10 వేల కోట్లు ఖర్చు చేసిందని, దీనివల్ల ఆడబిడ్డలకు అంతే మొత్తం ఆదా అయిందని వివరించారు.
మహిళా సంఘాల సాధికారత కోసం వినూత్న చర్యలు చేపట్టినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. సంఘాలకు 1000 బస్సులను కొనిచ్చి ఆర్టీసీకి లీజుకు ఇప్పించామని, అలాగే 1000 మెగావాట్ల సోలార్ ఎనర్జీ ప్లాంట్ల బాధ్యతను కూడా మహిళలకే అప్పగించామని చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఇందిరమ్మ క్యాంటీన్లు, జిల్లాల్లో భవనాల ఏర్పాటు చేశామన్నారు. నారాయణపేటలో పెట్రోల్ బంకు నిర్వహణ, 26 వేల ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ బాధ్యతలను మహిళా సంఘాలకే ఇచ్చామని తెలిపారు. హైటెక్ సిటీ వద్ద 1000 కోట్ల విలువైన స్థలంలో ‘మహిళా శక్తి స్టాల్స్’ ఏర్పాటు చేశామన్నారు. అమెజాన్తో ఒప్పందం కుదుర్చుకుని ఆడబిడ్డలు తయారు చేసే ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ కల్పిస్తున్నామని చెప్పారు.
రాష్ట్ర ఎకానమీని 2034 నాటికి వన్ ట్రిలియన్ డాలర్లకు, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్లకు చేర్చాలన్నది ప్రభుత్వ లక్ష్యమని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇది సాకారం కావాలంటే మహిళలకు భద్రత అత్యవసరమన్నారు. సమాజం నిలబడాలంటే మహిళలు స్వయంకృషితో ఎదగాలని కోరారు. ఎంత ఆర్థిక ప్రగతి సాధించినా పిల్లలు సరైన దారిలో నడవకపోతే వ్యర్థమని హెచ్చరించారు.
Read Also: పెట్రోల్ బంకుల దగ్గర అసలేం జరుగుతోంది? ఒక్క రూమర్.. రెండు రాష్ట్రాల్లో అల్లకల్లోలం!