హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన రాష్ట్ర శాసనసభ్యుల స్పోర్ట్స్ మీట్-2026 ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. క్రీడల ప్రాధాన్యతను వివరిస్తూ గత పాలకుల వైఫల్యాలను ఎండగట్టారు.
⦿ హైదరాబాద్ అంటే బిర్యానీ, ఐటీ మాత్రమే కాదు..
హైదరాబాద్ నగరం కేవలం బిర్యానీ, ఐటీ రంగాలకు మాత్రమే పరిమితం కాదని క్రీడలకు చిరునామాగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఎల్బీ స్టేడియంలో ఈ రోజు ప్రారంభమైన తెలంగాణ శాసనసభ్యుల స్పోర్ట్స్ మీట్ తొలి ఎడిషన్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేబినెట్ సహచరులతో కలిసి క్రీడాజ్యోతిని వెలిగించి పోటీలను అధికారికంగా ప్రారంభించారు.
⦿ క్రీడలు మానసిక ప్రశాంతతకు మార్గం..
ప్రజా జీవితంలో నిరంతరం ఒత్తిడితో గడిపే నాయకులకు క్రీడలు గొప్ప ఉపశమనాన్ని ఇస్తాయని సీఎం పేర్కొన్నారు. తమ కేబినెట్లో అద్భుతమైన క్రీడాకారులు ఉన్నారని వారిలోని ప్రతిభను చాటేందుకు ఈ వేదిక ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు, మంత్రులు రాజకీయ విభేదాలు పక్కన పెట్టి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో సుదీర్ఘ కాలంగా క్రీడాపోటీలు నిర్వహించకపోవడం పట్ల రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత క్రీడల పట్ల ఆసక్తి తగ్గిందని మునుపటి వైభవం మళ్ళీ తీసుకురావాల్సిన బాధ్యత అందరిపై ఉందని గుర్తు చేశారు.
⦿ మెస్సీ పర్యటనపై అడ్డగోలుగా మాట్లాడారు..
ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ హైదరాబాద్ పర్యటనపై జరిగిన విమర్శలను ముఖ్యమంత్రి తీవ్రంగా ఖండించారు. నగరాన్ని గ్లోబల్ స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దే ప్రయత్నాలను కొందరు రాజకీయ కోణంలో చూడటం బాధాకరమని వ్యాఖ్యానించారు. మెస్సీని ఆహ్వానించడం ద్వారా తెలంగాణ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేయాలని భావిస్తే దానిని వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకున్నట్లు చిత్రించడం దురదృష్టకరమని అన్నారు. కోల్కతా వంటి నగరాల్లో మెస్సీ పర్యటన సమయంలో గందరగోళం ఏర్పడినా హైదరాబాద్లో మాత్రం అత్యంత క్రమశిక్షణతో విజయవంతంగా నిర్వహించామని ఇది రాష్ట్ర సమర్థతకు నిదర్శనమని గర్వంగా ప్రకటించారు.
LB స్టేడియంలో లెజిస్లేటర్స్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్
క్రీడా జ్యోతి వెలిగించి పోటీలను ప్రారంభించిన సీఎం రేవంత్రెడ్డి
నేడు, రేపు కొనసాగనున్న ఆటల పోటీలు
రేపు రవీంద్ర భారతిలో కల్చలర్ పోటీలు
పోటీల్లో పాల్గొననున్న మంత్రులు, ఎమ్మెల్యేలు
ఒకప్పుడు తెలంగాణ క్రీడల రాజధానిగా… pic.twitter.com/LGBqV8QpZ8
— BIG TV Breaking News (@bigtvtelugu) March 28, 2026
⦿ యూత్కు స్ఫూర్తిగా నిలవాలి..
శాసనసభ్యులు మైదానంలో క్రీడాకారులుగా మారి యువతకు మార్గదర్శకంగా నిలవాలని సీఎం సూచించారు. క్రీడారంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని వెల్లడించారు. భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయి క్రీడా ఈవెంట్లకు హైదరాబాద్ వేదిక కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ప్రజా ప్రతినిధులు, క్రీడా శాఖ అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ALSO READ: CM Revanth: మైనింగ్, ఇసుక తవ్వకాలపై సీబీసీఐడీ విచారణ.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం