CM Revanth Reddy: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన కుంభమేళా అయిన మేడారం మహా జాతర సమీపిస్తున్న వేళ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. వనదేవతలు సమ్మక్క-సారలమ్మల గొప్పతనాన్ని, వారి పోరాట స్ఫూర్తిని కొనియాడుతూ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఒక ఉద్వేగభరితమైన పోస్ట్ చేశారు. మేడారం అభివృద్ధి పనులను ‘ప్రజా ప్రభుత్వం’ చేపట్టిన దైవ కార్యంగా ఆయన అభివర్ణించారు.
చరిత్రలో అణగారిన వర్గాల కోసం, పేద ప్రజల కోసం పోరాడిన వారే నిజమైన దేవుళ్ళని సీఎం పేర్కొన్నారు. బలహీనుల పక్షాన నిలిచి ప్రాణత్యాగాలు చేసిన వీరులే తెలంగాణ ప్రజల పాలిట దైవాలని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వారి సంస్కృతి మన ఆత్మగౌరవానికి, అస్తిత్వానికి ప్రతీక అని, వారి పోరాటలే తెలంగాణ చరిత్రకు సాక్ష్యాలని ఆయన ట్వీట్లో పేర్కొన్నారు. సమ్మక్క-సారక్కల త్యాగాలు తరతరాలకు స్ఫూర్తినిస్తాయని కొనియాడారు.
సమ్మక్క-సారక్కలను “మనుషుల్లో దేవుళ్లు”గా అభివర్ణించిన సీఎం.. వారి గద్దెలను ఆధునీకరించడం తమ ప్రభుత్వ బాధ్యతగా పేర్కొన్నారు. ఆ అమ్మల చరిత్రను, వారు చూపిన తెగువను మరింత గొప్పగా రేపటి తరాలకు అందించాలనేది తమ ‘దైవ సంకల్పం’ అని తెలిపారు. మేడారం క్షేత్రంలో ప్రజా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను, ఆధునీకరణను ఒక సత్కార్యంగా భావిస్తున్నట్లు వెల్లడించారు. జాతర ఏర్పాట్లను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పకనే చెప్పారు.
జనవరి 28 నుంచి 31 వరకు జరగనున్న “మేడారం మహా జాతర-2026” పోస్టర్ ను ఆవిష్కరించాను.
ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీమతి కొండా సురేఖ, శ్రీమతి సీతక్క, శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.#MedaramMahaJatra2026 pic.twitter.com/igBVe1EtMf— Revanth Reddy (@revanth_anumula) December 21, 2025
Read Also: Bhatti Vikramarka: మహాలక్ష్మితో లాభాల్లోకి ఆర్టీసీ: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క