Bhatti Vikramarka: మహాలక్ష్మి పథకం అమలుతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) లాభాల బాట పట్టిందని.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆర్టీసీ బలోపేతమే లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నామని తెలిపారు. మహిళల ఉచిత బస్సు ప్రయాణం కోసం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం వల్ల ఆర్టీసీ ఆదాయం పెరిగిందని, అదే సమయంలో మహిళా సాధికారతకు బలమైన పునాది పడిందని ఆయన పేర్కొన్నారు.
ఆదివారం ప్రజాభవన్లో ఆర్టీసీ, బీసీ సంక్షేమ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ప్రత్యేక ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, రవాణా శాఖ అధికారులు, బీసీ సంక్షేమ శాఖ అధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని, పీఎఫ్ బకాయిలే రూ.1400 కోట్లకు చేరాయని గుర్తుచేశారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలోనే పీఎఫ్ బకాయిలను రూ.660 కోట్లకు తగ్గించామని తెలిపారు. అదే విధంగా సీసీఎస్ బకాయిలు రూ.600 కోట్ల నుంచి రూ.373 కోట్లకు తగ్గించామని వివరించారు. కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకుంటోందని చెప్పారు.
మహాలక్ష్మి పథకం కింద ఇప్పటి వరకు 255 కోట్ల ఉచిత బస్సు ప్రయాణాలు జరిగాయని ఉప ముఖ్యమంత్రి వెల్లడించారు. మహిళలకు ప్రత్యేక గుర్తింపు కల్పించేందుకు మహాలక్ష్మి ప్రయాణానికి ప్రత్యేక కార్డులు ప్రవేశపెట్టాలని అధికారులను ఆదేశించారు. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్తో ఒప్పందం చేసుకుని ఈ కార్డులు తెలంగాణలోని ప్రతి మహిళకు అందేలా చూడాలని సూచించారు.
ఆర్టీసీ ఆధునీకరణలో భాగంగా పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద హైదరాబాద్కు 2800 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయని తెలిపారు. వాటికి అవసరమైన చార్జింగ్ స్టేషన్లు, మౌలిక వసతులు వెంటనే కల్పించాలని అధికారులకు ఆదేశించారు. అలాగే నిజామాబాద్, వరంగల్ పట్టణాలకు 100 ఎలక్ట్రిక్ బస్సులు మంజూరయ్యాయని చెప్పారు. పర్యావరణహిత రవాణా వ్యవస్థ వైపు తెలంగాణ వేగంగా అడుగులు వేస్తోందని అన్నారు.
విద్యా రంగంపై కూడా ప్రజాప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభం రోజే విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్స్, షూస్ అందేలా చూడాలని ఆదేశించారు. నిధుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖకు సూచించారు. గురుకులాల్లో మెస్, కాస్మొటిక్ చార్జీలను 200 శాతం పెంచామని, ప్రతి మూడు నెలలకు ఒకసారి బిల్లులు చెల్లిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది మెస్, కాస్మొటిక్ చార్జీల కోసం రూ.152 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు.
బీసీ వర్గాల కులవృత్తుల రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని భట్టి పేర్కొన్నారు. నాయి బ్రాహ్మణ, రజక కులాలకు అందిస్తున్న ఉచిత విద్యుత్ బిల్లులను నెలవారీగా ఎలాంటి బకాయిలు లేకుండా విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. గీత వృత్తిదారుల రక్షణకు ఇప్పటి వరకు 30 వేల కాటమయ్య రక్షణ కవచాలు పంపిణీ చేసినట్లు తెలిపారు.
Also Read: కిషన్రెడ్డి తెలంగాణకు తెచ్చింది ఏమైనా ఉందా? మహేష్ కుమార్ ఆగ్రహం
ఈ సమావేశంలో రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీకి అవసరమైన నియామకాలపై ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ పోస్టులు, కండక్టర్ పోస్టులకు అనుమతులు ఇవ్వాలని, డ్రైవింగ్ లైసెన్స్ జారీలో ఉన్న ఇబ్బందులు తొలగించాలని కోరారు. ప్రజల అవసరాలు, కార్మికుల సంక్షేమమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని భట్టి విక్రమార్క మరోసారి స్పష్టం చేశారు.