CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి సోమవారం మఖ్తల్ పట్టణంలోని అతి పురాతనమైన శ్రీ పడమటి ఆంజనేయ స్వామి దేవాలయంను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మఖ్తల్ పట్టణంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి వచ్చిన సందర్భంగా సీఎం ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు.
సీఎం ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించే ముందు ఆలయ అర్చకులు.. సంప్రదాయ పద్ధతిలో పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. వేద మంత్రాల నడుమ ముఖ్యమంత్రిని ఆలయంలోకి ఆహ్వానించారు. అనంతరం స్వామివారి సన్నిధిలో సీఎంకు ప్రత్యేక అర్చన, అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు సీఎం పేరిట అర్చన చేసి, వేద ఆశీర్వాదాలతో తీర్థం, ప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి విషయంలో ప్రభుత్వం నిబద్ధతతో పని చేస్తోంది. భగవంతుని ఆశీర్వాదంతో రాష్ట్రంలోని ప్రతి ప్రాంతంలో సమగ్ర అభివృద్ధి సాధించడమే మా లక్ష్యం అని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకూ మౌలిక వసతులు, రహదారులు, వైద్య, విద్యా రంగాల్లో విస్తృతంగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు డాక్టర్ వాకాటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జిల్లా ఇంచార్జీ మంత్రి దామోదర రాజనర్సింహ తో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
స్థానిక ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఆలయాన్ని దర్శించుకోవడం వల్ల మఖ్తల్ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు లభించిందని తెలిపారు. ఆలయ అభివృద్ధికి కూడా ప్రభుత్వం నుంచి సహకారం అందించాలని వారు కోరారు. సీఎం ఈ ఆలయానికి సంబంధించి అభివృద్ధి అవసరాలను పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
Also Read: గుర్రంపై వచ్చి నామినేషన్ దాఖలు చేసిన సర్పంచ్ అభ్యర్థి
ముఖ్యమంత్రి ప్రాచీన దేవాలయాన్ని సందర్శించి స్వామివారి ఆశీర్వాదాలు పొందడం రాజకీయంగా, ఆధ్యాత్మికంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.