Revanth Reddy: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎస్ఐఆర్ అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం , పార్టీ శ్రేణులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎస్ఐఆర్ నిర్వహణ, అవగాహన సదస్సులపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గ ఇన్ఛార్జ్లతో ముఖ్యమంత్రి గారు నిర్వహించిన ఉన్నత స్థాయి జూమ్ సమావేశంలో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు నాయకులు ఈ విషయంలో ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై సీఎం తీవ్రంగా మండిపడ్డారు… ‘ఎస్ఐఆర్ అనేది చాలా సీరియస్ అంశం. దీనిపై జిల్లాల వారీగా జరిగిన అవగాహన సదస్సుల పూర్తి నివేదిక (రిపోర్ట్) నా వద్ద ఉంది. ఎవరు పని చేస్తున్నారు, ఎవరు నిర్లక్ష్యంగా ఉన్నారనేది స్పష్టంగా తెలుస్తోంది. కొందరు నాయకుల నిర్లక్ష్యం వల్ల పార్టీకి నష్టం జరుగుతుంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు’ అని గట్టిగా సీఎం హెచ్చరించారు.
పేదల రేషన్, ఆధార్ కార్డులకే ముప్పు..
ఎస్ ఐ ఆర్ విషయంలో అప్రమత్తంగా ఉండకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. “ఎస్ఐఆర్ విషయంలో మనం సరిగ్గా వ్యవహరించకపోతే పేద ప్రజలకు ఘోరమైన అన్యాయం జరుగుతుంది. ఒకవేళ పేదల ఓట్లు గనుక పోతే, వారి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. పేద ప్రజలకు ఎలాంటి అన్యాయం జరగనివ్వద్దు. వారి హక్కులను కాపాడాల్సిన బాధ్యత మనపై ఉంది” అని నాయకులకు సీఎం దిశా నిర్దేశం చేశారు.
Also Read: సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట.. ఆ ఐదు కేసులను కొట్టేసిన హైకోర్టు!
ఇన్ఛార్జ్ మంత్రులకు మరింత బాధ్యత..
ఈ ప్రక్రియలో ఇన్ఛార్జ్ మంత్రులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎస్ఐఆర్ పట్ల ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు జిల్లాల వారీగా మరిన్ని విస్తృత సదస్సులు ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు.
సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు ఇవే..
పార్టీ ఆదేశాలను పాటించకుండా, నిర్లక్ష్యంగా వ్యవహరించే నాయకులకు కేవలం 10 రోజుల సమయం మాత్రమే ఇస్తున్నామన్నారు. ఈ పది రోజుల్లో తీరు మార్చుకోకపోతే, వారి స్థానంలో తక్షణమే మరొక ఇన్ఛార్జ్ను నియమిస్తామని సీఎం స్పష్టంగా చెప్పారు. పని చేయకుండా పార్టీకి నష్టం కలిగించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించమన్నారు . కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్లను సమన్వయం చేసుకుంటూ, గ్రామ గ్రామాన ఎస్ఐఆర్ పై పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు.పార్టీ క్రమశిక్షణను, ఆదేశాలను ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించాల్సిందేనని, ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా ప్రతి నాయకుడు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ పని చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.