సీఎం రేవంత్ రెడ్డి మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును సీరియస్గా తీసుకున్నారు. వచ్చే రెండేండ్లలో మూసీని సుందరీకరించాలని ఆయన సంకల్పించారు. అందుకే ప్రతిపక్షాలు ఎటువంటి ఆటంకాలు కల్గించినా ఆయన వెనక్కి తగ్గేదేలేదని.. మూసీపై ముందుకే అని ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. అయితే, మూసీ పునురుజ్జీవం కోసం ఎవరైతే స్వచ్ఛందంగా భూములు ఇవ్వడానికి వస్తారో వారికి నష్టపరిహారంతో పాటే ఇందిరమ్మ ఇండ్లు కూడా కేటాయిస్తామని సీఎం రేవంత్ ఇటీవల ప్రకటించారు. పేదలకు అన్యాయం జరగనివ్వమని స్పష్టంచేశారు. ఈ క్రమంలోనే మూసీ పునరుజ్జీవంలో కీలక ముందడుగు పడింది. రంగారెడ్డి జిల్లా మంచిరేవుల వద్ద శ్రీ ఓంకారేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు.
సీఎం రేవంత్ మాట్లాడుతూ.. మూసీ సుందరీకరణలో భాగంగానే 8 ఎకరాల్లో రూ. 700 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపడుతున్నట్టు ప్రకటించారు. ఆలయంలో వంద అడుగుల గాలిగోపురం, మూసీ నది మధ్యలో వంద అడుగుల శివుడి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. నదీ జలాలను కాపాడుకోవడం మనందరి బాధ్యత అని సీఎం అన్నారు. గండిపేట ప్రాంతంలో మూసీ నది ప్రక్షాళన ఈశ్వరుడి అనుగ్రహంతోనే ప్రభుత్వం చేపట్టిందని పేర్కొన్నారు. ఎవరైనా ఈ ప్రాజెక్టు మీద దుష్ప్రచారం చేస్తే అస్సలు ఊరుకునేది లేదని, ప్రభుత్వం శివతాండం చేస్తుందని హెచ్చరించారు. మూసీ నది కాలుష్యం ప్రభుత్వ తప్పిదం కాదని, మానవ తప్పిదం అని పేర్కొన్నారు. ఆరు నూరైనా మూసీ ప్రక్షాళన చేసి తీరతామని సీఎం ప్రకటించారు.
మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు ప్రారంభించిన నాటి నుంచి సర్కారు మీద ప్రతిపక్షాలు బుదర చల్లుతూనే ఉన్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు ఈ ప్రాజెక్టు మీద పెద్దఎత్తున అవినీతి ఆరోపణలు చేస్తూ వస్తున్నారు.బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీశ్ రావు పదే పదే మూసీ ప్రాజెక్టుపై విషం కక్కుతున్నారని సీఎం పలుమార్లు ప్రస్తావించారు.మూసీ ప్రక్షాళనకు రూ.7 వేల కోట్లకు పైగా ఖర్చవుతుందని ప్రభుత్వం ప్రకటించినా.. రూ.లక్ష కోట్లు ఖర్చు చేస్తున్నారని వారిద్దరూ ఆరోపిస్తున్నారని కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నారు. గాంధీ సరోవర్ వద్ద మహాత్ముడి విగ్రహానికి సైతం రూ.75 కోట్లు మాత్రమే ఖర్చు అవుతుందని సీఎం రేవంత్ ఇటీవల స్పష్టంచేశారు.అయినప్పటికీ అక్కడ ఇండ్లు కోల్పోతున్న వారిని అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ రాజకీయాలు చేస్తున్నదని ఫైర్ అవుతున్నారు.
ఈ క్రమంలోనే సీఎం రేవంత్ తీవ్ర హెచ్చరికలు పంపారు.ఇకమీదట మూసీ పునరుజ్జీవం మీద ఎవరైనా దుష్ప్రచారం చేస్తే శివతాండవం చేస్తామన్నారు.ఈ మేరకు సీఎం జాబితాలో కేటీఆర్, హరీశ్ రావుల పేర్లు టాప్లో ఉన్నాయని తెలుస్తోంది.ఆ తర్వాత బీజేపీ నేతల పేర్లు ఉన్నట్టు సమాచారం. ఇంతకాలం ప్రతిపక్షాల విమర్శలపై మౌనంగా ఉంటూ వచ్చిన రేవంత్ రెడ్డి ఒక్కసారిగా హెచ్చరికలు చేయడంతో వారిమీద ఎటువంటి యాక్షన్ ఉంటుందా? అని పెద్దఎత్తున చర్చ జరుగుతున్నది. హరీశ్ రావు మీద ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు, కేటీఆర్ మీద ఫార్ములా ఈ కార్ రేసు కేసు విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే విచారణలో వేగం పెంచి వారిని అరెస్టు చేయిస్తారా? అని ప్రచారం జరుగుతోంది. కాగా, ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఏసీబీ ఇప్పటికే చార్జ్ షీట్ నమోదు చేసిన విషయం తెలిసిందే.