Telangana: తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతుండటంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఈ నేపథ్యంలో, విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలోని అన్ని పాఠశాలల పని వేళలను మారుస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
మారిన టైమింగ్స్ ఇవే..
ఇప్పటివరకు జిల్లాలోని పాఠశాలలు ఉదయం 9:00 గంటలకు ప్రారంభమై, సాయంత్రం 4:15 గంటల వరకు కొనసాగేవి. అయితే, తెల్లవారుజామున మంచు కురుస్తుండటం, చలి గాలులు ఎక్కువగా ఉండటంతో విద్యార్థులు పాఠశాలలకు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిని గమనించిన కలెక్టర్, పాఠశాల ప్రారంభ సమయాన్ని మరో 40 నిమిషాల పాటు పొడిగించారు. కొత్త ఉత్తర్వుల ప్రకారం, పాఠశాలలు ఉదయం 9:40 గంటలకు ప్రారంభమై, సాయంత్రం 4:30 గంటల వరకు కొనసాగుతాయి.
విద్యార్థుల ఆరోగ్యంపై ఫోకస్..
చిన్నారులు చలి కారణంగా జలుబు, దగ్గు వంటి అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థులు చలిలో ప్రయాణించడం కష్టతరంగా మారింది. ఈ పరిస్థితులను విశ్లేషించిన జిల్లా యంత్రాంగం, విద్యాశాఖ అధికారులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకుంది. కలెక్టర్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇతర జిల్లాల్లోనూ డిమాండ్..
ఆదిలాబాద్ జిల్లాలో సమయాలు మార్చడంతో, రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కూడా ఇదే తరహా నిర్ణయం తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో కూడా చలి తీవ్రత అధికంగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు పడిపోతున్న తరుణంలో, ప్రభుత్వం స్పందించి అన్ని జిల్లాల్లో పాఠశాల సమయాలను సవరించాలని విద్యావేత్తలు మరియు పేరెంట్స్ అసోసియేషన్లు విజ్ఞప్తి చేస్తున్నాయి.
ప్రస్తుతానికి ఈ మార్పు ఆదిలాబాద్ జిల్లాకు మాత్రమే పరిమితం కాగా.. రానున్న రోజుల్లో చలి తీవ్రతను బట్టి ఇతర జిల్లా కలెక్టర్లు కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
ALSO READ: Group-3 Results: టీజీపీఎస్సీ తీపికబురు.. గ్రూప్-3 ఫలితాలు విడుదల