Gadwal Collector: మున్సిపల్ ఎన్నికల్లో కౌంటింగ్ ప్రక్రియ చాలా కీలకమైనదని, ఎలాంటి తప్పిదాలకు చోటు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ (Collector B M Santosh) అన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఐడిఓసి సమావేశపు మందిరంలో బ్యాలెట్ పేపర్స్ కౌంటింగ్ సూపర్వైజర్స్, అసిస్టెంట్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లెక్కింపు చేపట్టే సిబ్బంది కేంద్రాలకు నిర్దేశిత సమయంలోగానే చేరుకుని, ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభించాలన్నారు. మూడు వార్డులకు కలిపి ఒక రిటర్నింగ్ అధికారి లెక్కింపు ప్రక్రియ పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు. మొదట పోస్టల్ బ్యాలెట్స్ లెక్కించాక సాధారణ బ్యాలెట్ పేపర్స్ లెక్కించాల్సి ఉంటుందన్నారు.
Also Read: HYDRAA: రూ.60 కోట్ల విలువైన భూమి సేఫ్.. ఇది కదా హైడ్రా పవర్ అంటే, ఎలా కాపాడారంటే..?
ఒక్కో వార్డులో రెండు నుంచి మూడు పోలింగ్ స్టేషన్లవారీగా బ్యాలెట్ బాక్స్ లు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా లెక్కింపు చేయాల్సి ఉంటుందన్నారు. చెల్లుబాటు, చెల్లుబాటు కానీ బ్యాలెట్ పేపర్స్ విషయంలో ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరించాలని, తుది నిర్ణయం సంబంధిత వార్డుల రిటర్నింగ్ అధికారులు తీసుకుంటారన్నారు. రీకౌంటింగ్ విషయంలో నిబంధనలు పాటించాలని, తుది ఫలితాన్ని ప్రకటించడానికి ముందే ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్త వహించాలన్నారు. ఎన్నికల సంఘం ప్రచురించిన హ్యాండ్ బుక్కును క్షుణ్ణంగా అధ్యయనం చేసి కౌంటింగ్ ప్రక్రియ నియమ, నిబంధనలను పూర్తిస్థాయిలో తెలుసుకోవాలని సూచించారు.
ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు, ఏజెంట్లకు నిబంధనల ప్రకారం కౌటింగ్ కేంద్రాల వద్ద అనుమతించాలని, వారికి గుర్తింపు కార్డులు అందజేయాలన్నారు. మున్సిపల్ ఎన్నికలను విజయవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసిందని, విధులు నిర్వర్తించే ప్రతి ఒక్కరూ సమర్థవంతంగా పనిచేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ శిక్షణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, జెడ్పి డిప్యూటీ సీఈవో నాగేంద్రం, ఎన్నికల శిక్షణ నోడల్ అధికారి రమేష్ బాబు, శిక్షకులు, తదితరులు పాల్గొన్నారు.
Also Read: Bandi Sanjay: 100 కోట్ల ఒప్పందమా? ఆధారాలు చూపండి! బండి సంజయ్పై కాంగ్రెస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు