Bandi Sanjay: కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ , ఎంఐఎం పార్టీల మధ్య భారీ స్థాయిలో చీకటి ఒప్పందం కుదిరిందని ఆయన చేసిన ఆరోపణలు ఇప్పుడు పోలీస్ స్టేషన్ మెట్లెక్కాయి.
ఇటీవల మీడియాతో మాట్లాడిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్.. కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం నేతలతో చేతులు కలిపిందని విమర్శించారు. ఈ రెండు పార్టీల మధ్య సుమారు 100 కోట్ల రూపాయల ఒప్పందం కుదిరిందని.. ఎన్నికల్లో ఒకరికొకరు సహకరించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. బాధ్యతాయుతమైన కేంద్రమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టించింది.
బండి సంజయ్ చేసిన ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఎటువంటి ఆధారాలు లేకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు కరీంనగర్ లోని స్థానిక పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ నేతలు అధికారికంగా ఫిర్యాదు చేశారు.
100 కోట్ల ఒప్పందం జరిగిందని బండి సంజయ్ చేసిన ఆరోపణలపై తక్షణమే సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు. కేంద్రమంత్రిగా ఉన్న వ్యక్తి ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదని.. తన వద్ద ఉన్న ఆధారాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఒకవేళ విచారణలో ఈ ఆరోపణలు నిరాధారమైనవని తేలితే.. ప్రజలను తప్పుదోవ పట్టించినందుకు.. పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించినందుకు బండి సంజయ్పై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
కార్పొరేషన్ ఎన్నికల వేళ ఈ పరిణామం కరీంనగర్లో రాజకీయ వేడిని పెంచింది. కాంగ్రెస్ శ్రేణులు ఈ విషయాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. మరోవైపు, బండి సంజయ్ వర్గీయులు మాత్రం తమ వద్ద సమాచారం ఉందని, అందుకే ఈ వ్యాఖ్యలు చేశారని సమర్థించుకుంటున్నారు. పోలీసుల విచారణలో ఏ విషయాలు వెలుగులోకి వస్తాయోనన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Also Read: పవన్ డ్రామాలు.. మాజీ మంత్రుల కబ్జాలు.. విరుచుకుపడ్డ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
కేంద్ర మంత్రి బండి సంజయ్ పై పోలీసులకు ఫిర్యాదు
కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు రూ.100 కోట్ల ఒప్పందం చేసుకున్నాయన్న వ్యాఖ్యలపై కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
నిరాధారమైన ఆరోపణలు చేసిన బండి సంజయ్ పై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
Complaint filed against Union Minister… pic.twitter.com/1LW50wQUkU
— BIG TV Breaking News (@bigtvtelugu) February 9, 2026