Collectors Competition: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ల మధ్య ‘నెంబర్ వన్’ పోటీ నెలకొన్నది. ముఖ్యమంత్రి నిర్దేశించిన ’99 రోజుల కార్యాచరణ’ లోనే దీన్ని సాధించాలని కలెక్టర్లు తాపత్రయం పడుతున్నారు. తమ పనితీరుపై సర్కార్ లో గుర్తింపు లభించాలని అన్ని జిల్లాల కలెక్టర్లు ఆశిస్తున్నారు. ఇటీవల రివ్యూలో కూడా ప్రభుత్వం చేపట్టబోయే 99 డేస్ కార్యక్రమంలో కలెక్టర్ల ఫర్మామెన్స్ ను పరిశీలిస్తామని స్వయంగా సీఎం చెప్పారు. దీంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ డెడ్ లైన్ లోపు తమ జిల్లాను రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలపాలనే పట్టుదలతో కలెక్టర్లు క్షేత్రస్థాయి పర్యటనలతో ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఏసీ గదులు వీడాలని సీఎం సూచించగానే, ఒకప్పుడు ఫైళ్లకే పరిమితమైన జిల్లా యంత్రాంగం, ఇప్పుడు పల్లె బాట పట్టింది. సీఎం ఆదేశాల తర్వాత పాలనలో వేగం పెరగడం విశేషం. ప్రభుత్వం తలపెట్టిన కొత్త ప్రోగ్రామ్ ద్వారా ప్రజలతో మమేకవడంతో పాటు, ప్రభుత్వంలోనూ మైలేజ్ పొందేందుకు జిల్లా కలెక్టర్లు తమ పనితీరులో వేగాన్ని పెంచారు. ప్రభుత్వంలో మంచి మార్కులు పొందేందుకు ప్రత్యేకమైన నిర్ణయాలను తీసుకుంటున్నారు.
ఇటీవల సెక్రటేరియట్ లో కలెక్టర్లతో సీఎం రివ్యూ పూర్తైన మరుసటి రోజే ..కొందరు కలెక్టర్లు క్షేత్రస్థాయి విజిట్ లు మొదలు పెట్టడం గమనార్హం. కొందరు కలెక్టర్లు ఉదయం 6 గంటలకే పారిశుధ్య పనులు, స్కూళ్లు, హాస్పిటల్స్ను కలెక్టర్లు ఆకస్మికంగా తనిఖీ చేస్తున్నారు . అంతేగాక ‘ప్రజావాణి’ ఫిర్యాదులకు 99 రోజుల్లోనే పరిష్కారం చూపాలనే లక్ష్యంతో ప్రత్యేక సెల్స్ ఏర్పాటు చేశారు.దీంతో పాటు పెండింగ్లో ఉన్న రోడ్లు, భవనాలు, సాగునీటి ప్రాజెక్టుల పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు. పెండింగ్ సమస్యలు, వాటికి పరిష్కారాలను నేరుగా ప్రజల వద్దకు వెళ్లి డిస్కషన్ చేయడం గమనార్హం. దీంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, మధ్యాహ్న భోజన నాణ్యతపై ప్రత్యేక నిఘా పెట్టారు. కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు స్వయంగా విద్యార్థులతో కలిసి భోజనం చేస్తూ క్షేత్రస్థాయి పరిస్థితిని అంచనా వేస్తున్నారు.మరి కొందరు భూ సమస్యల పరిష్కారానికి జిల్లాల్లో ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తున్నారు. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న ఫైళ్లను ఈ 99 రోజుల్లో క్లియర్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయా లేదా? అని ఆడిట్ చేస్తున్నారు. స్కీమ్స్ అందకపోవడానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. అధికారుల మధ్య సమన్వయం లేకపోతే క్షేత్రస్థాయిలోనే సీరియస్ వార్నింగ్ లు ఇస్తున్నారు.
Also Read: UPSC 2025: సివిల్ సర్వీసెస్లో సత్తా చాటిన తెలంగాణ యూత్..!
ఈ 99 రోజుల ప్రోగ్రామ్ ముగిసిన తర్వాత ప్రభుత్వం ప్రతి జిల్లా పనితీరును విశ్లేషించనుంది. ఉత్తమ ప్రతిభ కనబరిచిన జిల్లాలకు, అధికారులకు ప్రత్యేక గుర్తింపు ఉండటంతో పాటు కలెక్టర్లు ఈ ప్రోగ్రామ్ ను సీరియస్ గా తీసుకున్నారు. దీంతో పాటు ప్రజలు, అధికారుల మధ్య గ్యాప్ ను తొలగించాలని ప్రయత్నిస్తున్నారు. తద్వారా ప్రజల్ల వ్యతిరేకత రాకుండా చూసుకోవాలన్నది కలెక్టర్ల ప్రధాన ఉద్దేశ్యం.ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా ప్రజాపాలన అందరి దగ్గరకు తీసుకువెళ్లడమే తమ లక్ష్యం అని ఓ కలెక్టర్ తెలిపారు. ఈ 99 రోజుల్లో జిల్లా రూపురేఖలు మార్చేందుకు యంత్రాంగం అంతా శ్రమిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. దీంతో పాటు భవిష్యత్ లో మంచి పోస్టింగ్ లు పొందాలనే ఉద్దేశ్యం కూడా కొందరి కలెక్టర్లతో నెలకొన్నది.