రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని పథకాలు, కార్యక్రమాలు చేపట్టినా మైలేజ్ రావడం లేదని అధిష్టానం గుర్తించింది. ఓవైపు ప్రభుత్వానికి పెద్దగా ఆదాయం లేకపోయినా అప్పులు తెచ్చి మరీ సీఎం రేవంత్ సంక్షేమం అమలు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఆరు గ్యారెంటీల్లో మహిళలకు రూ.2500 మినహా అన్నింటినీ సర్కారు అమలు చేసినా క్షేత్రస్థాయిలో ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతోందని తెలుస్తోంది. ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలు, సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మంత్రులు, జిల్లా ఇన్చార్జులు ఫెయిల్ అయ్యారని ప్రచారం జరుగుతోంది.అందుకే రాష్ట్ర మంత్రులపై సీఎం రేవంత్ నారాజ్గా ఉన్నట్టు సమాచారం.
రాష్ట్ర ప్రభుత్వ పనితీరు గురించి క్షేత్రస్థాయిలో ప్రజలు ఏమనుకుంటున్నారు? మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపైనా సీఎం రేవంత్ నిఘా వర్గాల ద్వారా నివేదికలు తెప్పించుకుంటున్నట్టు తెలుస్తోంది.కిందిస్థాయిలో పథకాలు అందుతున్నాయా? ప్రజలు సంతోషంగా ఉన్నారా? రుణమాఫీ, రైతుభరోసా, పంట బోనస్ విషయంలో రైతులు సంతృప్తిగా ఉన్నారో లేదో అని ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నట్టు సమాచారం. ప్రభుత్వానికి మైలేజ్ తీసుకురావడం కోసం, ఎన్నికల్లో పార్టీ సత్తా చాటేందుకు జిల్లా ఇన్చార్జి మంత్రులను నియమించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ గత ఎన్నికల్లో కొందరు మంత్రుల పనితీరు బాగుందని నివేదికలు అందగా.. మరికొందరు సీఎం ఆశించిన స్థాయిలో పనితీరు కనబరచడం లేదని తెలిసింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి ఆరు నెలలకు ఒకసారి మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై నివేదికలు తెప్పించుకుంటున్నట్టు తెలుస్తుండగా.. అందులో కొందరు పనితీరు మెరుగవ్వగా.. మరికొందరు మాత్రం ఏ మాత్రం పనితీరు కనబరచడం లేదని సీఎం రేవంత్ గుర్తించినట్టు సమాచారం. త్వరలోనే వారిపై చర్యలు తీసుకునేందుకు సీఎం సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలుమార్లు హెచ్చరించిన సీఎం.. కేబినెట్ విస్తరణ, ప్రక్షాళన సమయంలో పనితీరు సరిగా కనబరచని వారికి ఉద్వాసన పలుకుతారని ప్రచారం జరుగుతోంది. మిగతా ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టికెట్ నిరాకరించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇదే విషయమై పార్టీలోని కొందరికి హింట్ సైతం ఇచ్చినట్టు సమాచారం.
కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు తమకు ఓటు వేసి గెలిపించిన ప్రజల కోసం కాకుండా కేవలం డబ్బు సంపాదనే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు సీఎంకు నివేదికలు సైతం అందిచనట్టు సమాచారం. ఈ క్రమంలోనే వారికి ఇప్పటికే వార్నింగ్ ఇచ్చిన సీఎం.. త్వరలో వారిపై కఠిన చర్యలకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. పద్ధతి మార్చుకోకుంటే పార్టీ నుంచి సైతం వారిపై క్రమశిక్షణా చర్యలకు తీసుకునే చాన్స్ ఉన్నట్టు చర్చ జరుగుతున్నది.మొన్నటివరకు ఐదు రాష్ట్రాల ఎన్నికలు, ఫలితాల అనంతరం తమిళనాడు, కేరళలో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో సీఎం రేవంత్ హస్తినలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఢిల్లీ పర్యటన అనంతరం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నిలపై సీఎం ఫోకస్ పెట్టనున్నారు. దీనికి తోడు పెండింగ్ ప్రాజెక్టులపైనా దృష్టి సారించనున్నారు. ఆ తర్వాత పనితీరు సరిగా లేని మంత్రులు, ఎమ్మెల్యేలపై యాక్షన్ ప్లాన్ సిద్దం చేయనున్నారని సమాచారం.