రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాలు రెండు ప్రధాన కూటముల మధ్యే సాగుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్, కమ్యూనిస్టులు, కోదండరాం ఒక కూటమిగా ఉంటారని పేర్కొన్నారు. బీఆర్ఎస్, బీజేపీ మరో కూటమిగా ఏర్పడే అవకాశం ఉందని ఆయన జోస్యం చెప్పారు.
కాళేశ్వరం విచారణ – కేంద్రానికి సవాల్
కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలపై సీబీఐ విచారణ జరపాలని కిషన్ రెడ్డి గతంలో డిమాండ్ చేశారని రేవంత్ గుర్తు చేశారు. తమ ప్రభుత్వం ఇప్పటికే ఈ అంశాన్ని సీబీఐకి అప్పగించిందని చెప్పారు. కేంద్రం ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. సీబీఐ విచారణను అడ్డుకోవడానికే హరీష్ రావు ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారని సీఎం ఆరోపించారు. బీజేపీని ప్రసన్నం చేసుకునేందుకు గులాబీ నేతలు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరం విషయంలో ఇప్పటికే విజిలెన్స్ నివేదికలు ప్రాథమిక లోపాలను ఎత్తిచూపాయని పేర్కొన్నారు. కేంద్రం రాజకీయాలకు తలొగ్గి విచారణను అడ్డుకుంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. తానే స్వయంగా మంత్రి ఉత్తమ్ కుమార్తో కలిసి ఢిల్లీ వెళ్లి సీబీఐ డైరెక్టర్ను కలుస్తానని స్పష్టం చేశారు.
హైడ్రా చర్యలు – కోర్టు తీర్పులు
ప్రభుత్వ భూములను కాపాడేందుకే హైడ్రా పనిచేస్తోందని రేవంత్ రెడ్డి తెలిపారు. అక్రమ భూములను సొంతం చేసుకున్న వారు హైడ్రాను తప్పు పడుతున్నారని మండిపడ్డారు. విద్యుత్ కొనుగోళ్లపై వేసిన ఘోష్ కమిషన్కు వ్యతిరేకంగా కేసీఆర్ కోర్టుకు వెళ్లడంపై ఆయన స్పందించారు. కమిషన్ ఏర్పాటు చట్టవిరుద్ధం కాదని కోర్టు తేల్చిందని గుర్తు చేశారు. కేవలం సెక్షన్ 8(బి) ప్రకారం నేచురల్ జస్టిస్ పాటించలేదనే చిన్న ఉపశమనం మాత్రమే వారికి దక్కిందని వివరించారు. దీనిని విజయంగా చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ ముమ్మరంగా సాగుతోందని ప్రభాకర్ రావు అందుబాటులోకి రావడంతో మరిన్ని నిజాలు బయటకు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
కేంద్రం ముందున్న సవాళ్లు
మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల విభజన, జమిలి ఎన్నికల వంటి అంశాలపై కేంద్రం తీరును రేవంత్ తప్పుబట్టారు. మహిళా బిల్లును డీలిమిటేషన్తో లింక్ చేయడం వల్ల ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. పార్లమెంట్ సీట్ల పెంపు విషయంలో కేంద్ర విధానం సరిగ్గా లేదని అభిప్రాయపడ్డారు. జమిలి ఎన్నికల నిర్వహణపై కేంద్రానికే స్పష్టత లేదని ఎద్దేవా చేశారు. బీజేపీ తన శిఖండి రాజకీయాలను మానుకోవాలని రేవంత్ రెడ్డి హితవు పలికారు.
ALSO READ: తెలంగాణ పర్యాటక శాఖ సంచలన నిర్ణయం.. ఆ పది జిల్లాలపై స్ఫెషల్ ఫోకస్!