Party Discipline: స్వేచ్ఛ బ్యూరో : పార్టీలో వివాదాలు లేకుండా పనిచేయాల్సిందేనని క్రమ శిక్షణ కమిటీ చైర్మన్ ఎంపీ మల్లు రవి తెలిపారు. ఆదివారం ఆయన గాంధీభవన్ లో మాట్లాడుతూ.. పార్టీలో నేతల మధ్య సమన్వయం అవసరం అన్నారు. పదే పదే కావాలని సమస్యలు సృష్టిస్తే ఆయా నేతలను సస్పెండ్ చేయడం తప్పనిసరి అంటూ హెచ్చరించారు.
ఇక పాలకుర్తి నియోజకవర్గం అంశంపై డిస్కషన్ చేశామన్నారు. క్రమశిక్షణ కమిటిలో పాలకుర్తి నియోజకవర్గం నుండి జాన్సీ రెడ్డి హాజరయ్యారన్నారు. గతంలో జాన్సీ రెడ్డి, యశ్వస్విని రెడ్డి లు పార్టీ కి వ్యతిరేకంగా పని చేస్తున్నారని హరిప్రసాద్, కృష్ణ కిషోర్ పై కంప్లైంట్ ఇచ్చారని, కాంగ్రెస్ క్యాడర్ ని పట్టించుకోవడం లేదని ఫిర్యాదు వచ్చిందన్నారు.
ఈ నేపథ్యంలోనే ఇరు వర్గాలను గాంధీభవన్ కు పిలిపించి మాట్లాడమన్నారు. అన్ని వివరాలు రికార్డు చేశామన్నారు. ఎమ్మెల్యే యశ్వస్విని రెడ్డి అందుబాటులో లేనందున మరోసారి కమిటీ భేటీ కానున్నదన్నారు. ఈ నెల 30న మీటింగ్ నిర్వహిస్తామన్నారు. అంతేగాక ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీనియర్ నేతలతో కూడా మాట్లాడతామన్నారు. అంతిమంగా అందరూ పార్టీ కోసం పనిచేయాల్సిందేనని నొక్కి చెప్పారు.
Also Read: నెలాఖరుకల్లా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలి.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి