Fertilizer Prices: స్వేచ్ఛ బ్యూరో: ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాక ముందే దౌల్తాబాద్ మండలంలో ఎరువుల విక్రయాలపై రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కొన్ని కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెంచిన నేపథ్యంలో, తమ వద్ద ఉన్న పాత స్టాక్ను కూడా కొత్త ధరల పేరుతో అధిక ధరలకు విక్రయిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇదే సమయంలో కొన్ని చోట్ల డీఏపీ ఎరువులను కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు అమ్ముతున్నారని చెబుతున్నారు.
రాబోయే ఖరీఫ్ సాగు కోసం రైతులు ఇప్పటికే భూమి దుక్కి పనులు ప్రారంభించగా, విత్తనాలతో పాటు కాంప్లెక్స్ ఎరువులు కొనుగోలు చేస్తున్నారు. ఈ అవసరాన్ని అవకాశంగా మార్చుకుని కొందరు వ్యాపారులు ఎరువుల ధరలను తమ ఇష్టానుసారం పెంచుతున్నారని రైతులు వాపోతున్నారు. రైతుల కథనం ప్రకారం, గతంలో రూ.1400కు లభించిన 20-20-0-13 50 కిలోల కాంప్లెక్స్ ఎరువు బస్తాను ప్రస్తుతం రూ.1500 నుంచి రూ.1580 వరకు విక్రయిస్తున్నారు. అయితే వ్యాపారుల వద్ద ఉన్న స్టాక్ పాత ధరలకే కొనుగోలు చేసినదేనని, అయినప్పటికీ కొత్త ధరల పేరుతో అదనపు భారం మోపుతున్నారని ఆరోపిస్తున్నారు. అదేవిధంగా, ప్రభుత్వం డీఏపీ ధర పెంచలేదని రైతులు చెబుతున్నప్పటికీ, మార్కెట్లో కొరత ఉందనే కారణంతో రూ.1350 పరిధిలో ఉండాల్సిన బస్తాను రూ.1600 వరకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Also Read: మేడ్చల్ హోటల్లో పాకిస్తాన్ ఏజెంట్ కలకలం
గరిష్ట విక్రయ ధర కంటే ఎక్కువ ధరకు విక్రయించకూడదనే నిబంధనలు ఉన్నప్పటికీ, వాటిని పట్టించుకోవడం లేదని రైతులు అంటున్నారు. ఇక ఎరువుల కొనుగోలుకు వెళ్లిన రైతులకు అవసరం లేని పురుగుమందులు, ఇతర వ్యవసాయ సామగ్రిని కూడా తప్పనిసరిగా కొనుగోలు చేయాలంటూ షరతులు పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. దీనిపై ప్రశ్నిస్తే “ఎరువులే లేవు.. వెళ్లిపోండి” అంటూ కొందరు వ్యాపారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ పరిస్థితులపై వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టడం లేదని రైతులు విమర్శిస్తున్నారు. రైతులకు అవసరమైన సమయంలో ఎరువుల లభ్యత, ధరల నియంత్రణ, సరైన సలహాలు అందించాల్సిన అధికారులు ఈ స్పందించకపోవడంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఖరీఫ్ సీజన్ ముందు ఎరువుల విక్రయ కేంద్రాలపై ప్రత్యేక తనిఖీలు చేపట్టి, ఎంఆర్పీకి మించి విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Also Read: మహిళలకు గుడ్ న్యూస్.. ఆర్టీసీ బస్సుల్లో మరో కోత్త సేవలు ప్రారంభం!