Rajya Sabha: స్వేచ్ఛ బ్యూరో: రాజ్యసభ సీట్ల కేటాయింపుల్లో విభేదాలు నెలకొన్నాయి. రాజ్యసభ సీట్లు కేటాయింపులో కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నాయకుల్లో కొందరు గుర్రుగా ఉన్నట్లు తెలిసింది. ఒక్కో నేత ఒక్కో అభిప్రాయాన్ని వ్యక్త పరుస్తున్నారు. పార్టీలోని సీనియర్లకు ఇవ్వాల్సిన పదవులను ఇతరులకు ఇవ్వడమేమిటీ? అనే ప్రశ్న ఆయా నేతల నుంచి వినిపిస్తున్నది. అంతేగాక ఒక సీటును రాష్ట్రానికి సంబంధం లేని నేతకు ఇవ్వడంపై సీనియర్ నేతలు చాలాసీరియస్ గా ఉన్నారు. పాత లీడర్లకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై ఓ సీనియర్ మంత్రితో సీనియర్ నేత ప్రత్యేకంగా భేటీ అయినట్లు సమాచారం. త్వరలో ఢిల్లీకి వెళ్లి కూడా తమ అభిప్రాయాలను వ్యక్తపరచాలని ఆయా నేతలు ఆలోచిస్తున్నారు తెలంగాణలో రెండున్నర ఏళ్ల క్రితం అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ కు ..క్రమంగా అసంతృప్తి సెగలు తోడవుతున్నాయి.దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న ‘ఒరిజినల్’ కాంగ్రెస్ వాదులకు, ఇటీవల పార్టీలోకి చేరి పదవులు పొందుతున్న ‘వలస’ నాయకులకు మధ్య అగాధం పెరుగుతోందని గాంధీభవన్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
ఇటీవల రాష్ట్రంలో ఖాళీ అయిన రాజ్యసభ సీట్లను ఏఐసీసీ కోటా ద్వారా అభిషేక్ సింగ్వీకి, రాష్ట్ర కోటా నుంచి వేం నరేందర్ రెడ్డికి కేటాయించారు.అయితే పైకి సీనియర్లు మౌనంగా ఉన్నప్పటికీ, లోలోపల మాత్రం ఈ ప్రపోజల్ ను తప్పుపడుతున్నారు. పార్టీలో సీనియర్ నాయకులకు ఇవ్వాల్సిన పదవులను సరైన తీరులో ఇవ్వడం లేదనే అభిప్రాయం వారిలో ఉన్నది. కష్టకాలంలో పార్టీని వీడని నేతలను పక్కకు పెట్టి విస్మరిస్తారా? అనే విమర్శలు మొదలయ్యాయి. పదేళ్ల కేసీఆర్ పాలనలో నిర్బంధాన్ని తట్టుకొని మరి పార్టీ కోసం పనిచేస్తే పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వలేరా? అని ఆయా సీనియర్ నేతలు చెప్తున్నారు. గాంధీభవన్ కు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితుల్లో పార్టీని కంటికి రెప్పాలా కాపాడామనేది సీనియర్ నాయకుల వాదన. వాస్తవానికి గతంలో పదవుల కేటాయింపుల్లో మూడు నియమాలు వర్తిస్తాయని ఏఐసీసీ రాష్ట్ర ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్ పేర్కొన్నారు. పార్టీలో మొదట్నుంచి ఉన్నోళ్లు, ఎన్నికల ముందు చేరినోళ్లు, ఆ తర్వాత వచ్చినోళ్లు..ఇలా మూడు కేటగిరీలుగా చేరి పదవులు కేటాయిస్తామని స్పష్టం చేశారు. కానీ ఇందులో ఫస్ట్ కేటగిరీలో ఉన్నోళ్లకూ పదవులు రావడం లేదని ఆ సీనియర్ నేతలు చెప్తున్నారు.
Also Read: TGFA 2025: తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025 వేడుకకు గెస్ట్లుగా బాలీవుడ్ బ్యూటీస్.. ఎవరంటే?
రాజ్యసభ సీటు కోసం మాజీ పీసీసీ చీఫ్ వీ హనుమంతరావు, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్, కుసుమకుమార్, జీవన్ రెడ్డి, చిన్నారెడ్డి తదితర సీనియర్లు పోటీపడ్డారు. వీరంతా ఆ సీట్ ను పొందేందుకు అర్హులే. కానీ ఈ నేతలను కాదని అభిషేక్, వేం నరేందర్ లకు హైకమాండ్ అవకాశం కల్పించింది. తాము సుదీర్ఘంగా పార్టీ కోసం పనిచేస్తే కనీసం అవకాశం కల్పించకపోవడంపై సీనియర్లు గుర్రుగా ఉన్నారనే ప్రచారం గాంధీభవన్ లో జరుగుతుంది. మరోవైపు కొందరు పార్టీలోని లీడర్లు జగ్గారెడ్డికి ఇవ్వాల్సి ఉండేనని చెప్పుకొస్తున్నారు. అంతేగాక మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అయితే ఏకంగా జగ్గారెడ్డి పీసీసీ చీఫ్ అయితే వంద సీట్లు ఖాయమనే స్టేట్ మెంట్ ఇచ్చారు. ఇవన్నీ ఆయా లీడర్ల అసంతృప్తిని బయట పెడుతూనే, పార్టీలోని లుకలుకలను కూడా తెర మీదకు తీసుకువచ్చాయి.
Also Read: Telangana BJP: 2029లో తెలంగాణ సీఎంగా ఆరడుగుల బుల్లెట్..?