Huzurabad Politics: స్వేచ్ఛ బ్యూరో: శాసనసభ వేదికగా సీనియర్ దళిత నాయకుడు, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పట్ల హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రవర్తించిన తీరు అత్యంత హేయమని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆదివారం హుజూరాబాద్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం ఉన్న ఒక గౌరవప్రదమైన నాయకుడిని అవమానించడం ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
దళితుల పట్ల, ముఖ్యంగా సీనియర్ నాయకుల పట్ల కౌశిక్ రెడ్డి ప్రదర్శిస్తున్న వివక్ష రాజకీయాల్లో మంచి పద్ధతి కాదని ప్రణవ్ పేర్కొన్నారు. “కడియం శ్రీహరి గారు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో కీలక పదవులు చేపట్టిన వ్యక్తి. అలాంటి వ్యక్తి పట్ల అసెంబ్లీ సాక్షిగా కౌశిక్ రెడ్డి ప్రవర్తించిన తీరు అసభ్యకరంగా ఉంది. దళితులపై దుర్భాషలాడటం ఆయనకు ఇదేమీ కొత్త కాదు, గతంలోనూ అనేక సందర్భాల్లో ఇలాగే అహంకారపూరితంగా వ్యవహరించారు” అని విమర్శించారు. సభాపతి సమక్షంలోనే ఇంతటి దురుసు ప్రవర్తన ఆయన రాజకీయ అపరిపక్వతకు నిదర్శనమని ధ్వజమెత్తారు.
Also Read: Hospital Controversy: తొర్రూరులో షోకాజ్ నోటీసుల డ్రామా.. భాదితులకు న్యాయం జరిగేనా..?
హుజూరాబాద్ ప్రజలు నమ్మి ఓట్లు వేసి గెలిపిస్తే, తన విపరీత చేష్టలతో నియోజకవర్గ గౌరవాన్ని కౌశిక్ రెడ్డి గంగలో కలిపేస్తున్నారని వొడితల ప్రణవ్ ఆవేదన వ్యక్తం చేశారు. “ఇన్ని రోజులు గల్లీల్లో పరువు తీసిన ఎమ్మెల్యే, ఇప్పుడు ఏకంగా చట్టసభ వేదికగా తన పిచ్చి చేష్టలతో హుజూరాబాద్ ప్రజలను తలదించుకునేలా చేస్తున్నారు. ఇటువంటి వ్యవహార శైలిని ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. రాజకీయాల్లో హుందాతనాన్ని పాటించలేనప్పుడు ఎమ్మెల్యేగా కొనసాగే అర్హత ఆయనకు లేదు” అని మండిపడ్డారు.
కడియం శ్రీహరిపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, కౌశిక్ రెడ్డి తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని ప్రణవ్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో దళిత సంఘాలు మరియు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గవ్యాప్తంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. భవిష్యత్తులోనైనా తన ప్రవర్తన మార్చుకుని ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని, లేదంటే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హితవు పలికారు.
Also Read: ఢిల్లీ ఎయిర్పోర్ట్లో గోల్డ్ మ్యాన్ ను విచారించిన ఐటీ అధికారులు.. స్పందించిన కొండ విజయ్ కుమార్!