Congress Vs BJP: తెలంగాణలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. నేషనల్ హెరాల్డ్ కేసులో గత పదేళ్లుగా సోనియా, రాహుల్ గాంధీలను ఈడీ (ED) ద్వారా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వేధించిందంటూ కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నారు. ఇటీవల ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్ను పరిగణనలోకి తీసుకోవడానికి నిరాకరించడంతో, ఇది తమ నేతలపై జరిగిన కుట్ర అని కాంగ్రెస్ స్పష్టం చేస్తోంది. బీజేపీ రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న బీజేపీ ఆఫీసుల ముట్టడికి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు.
గాంధీ భవన్ వద్ద హైటెన్షన్
హైదరాబాద్లోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం గాంధీ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ గాంధీ భవన్ నుంచి నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ర్యాలీగా వెళ్లేందుకు కాంగ్రెస్ శ్రేణులు ప్రయత్నించాయి. అయితే, శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నప్పటికీ, శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు భారీగా మోహరించారు. గాంధీ భవన్ మెయిన్ గేట్ వద్ద ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సహా పలువురు ముఖ్య నేతలను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చోటుచేసుకుంది.
ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హౌస్ అరెస్ట్
ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్తున్న కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. తనను అక్రమంగా గృహనిర్భంధం చేయడంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనలో పాల్గొనేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చే క్రమంలో గేటు దూకి వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును ప్రభుత్వం కాలరాస్తోందని ఆయన విమర్శించారు.
అయితే కేవలం హైదరాబాద్లోనే కాకుండా, తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాల్లో బీజేపీ కార్యాలయాల ముట్టడికి కాంగ్రెస్ కార్యకర్తలు తరలివచ్చారు. చాలా చోట్ల కాంగ్రెస్ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. సోనియా, రాహుల్ గాంధీలపై అక్రమ కేసులు పెట్టి బీజేపీ నీచ రాజకీయాలకు పాల్పడుతోందని, ఈ విషయంలో ప్రధాని మోదీ బహిరంగ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. పోలీసులు అడ్డుకున్నా, అరెస్టులకు భయపడకుండా తమ నిరసనలు కొనసాగిస్తామని పార్టీ ప్రకటించింది.
Also Read: కుప్పకూలిన మానేరు చెక్ డ్యామ్.. కొట్టుకుపోయిందా? కూలగొట్టారా..?
కాంగ్రెస్ ముట్టడి పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీజేపీ కార్యాలయాల వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. నాంపల్లిలోని బీజేపీ కార్యాలయానికి వెళ్లే రహదారులను బారికేడ్లతో మూసివేశారు. బీజేపీ నాయకులు కూడా కాంగ్రెస్ వైఖరిని తప్పుపడుతూ, కోర్టు ప్రక్రియను రాజకీయ నిరసనలుగా మార్చడం సరికాదని హితవు పలుకుతున్నారు. ఏదేమైనా, ఈ నిరసనలతో తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా ఢిల్లీ స్థాయి చర్చకు దారితీసింది.
ఇది శాంతియుత ధర్నా.. ఇప్పటికైనా మోదీ తన తప్పు తెలుసుకుని గాంధీ కుటుంబానికి క్షమాపణ చెప్పాలి
– టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ https://t.co/0JnHQwrna5 pic.twitter.com/uoXdYj63ps
— BIG TV Breaking News (@bigtvtelugu) December 18, 2025