Minister Azharuddin: జహీరాబాద్ బ్యూరో, స్వేచ్ఛ: కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర మంత్రి అజారుద్దీన్ (Minister Azharuddin)పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసమే ముఖ్యమంత్రి పదేపదే ఢిల్లీ వెళ్తుంటారని వివరించారు. అడగనిదే అమ్మయినా అన్నం పెట్టదన్న సామెతల రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి మంత్రులతో కలిసి అభివృద్ధి ఫలాల కోసం ప్రయత్నిస్తుంటారన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ సీనియర్ నేత డాక్టర్ ఉజ్వల్ రెడ్డి గెస్ట్ హౌస్ లో మంగళవారం నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ జహీరాబాద్ మున్సిపల్ చైర్మన్ ఎండి.యునుస్, వైస్ చైర్మన్ కొత్తకాపు శిరీష, కౌన్సిల్లర్లను సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ జహీరాబాద్ మున్సిపల్ అభివృద్ధికి పాలకమండలి కృషి చేయాలన్నారు.
తాను క్రికెట్ లో ఎన్నో సెంచరీలు కొట్టానని, ఇప్పుడు స్థానికులు సెంచరీ బాది కాంగ్రెస్ ను గెలిపించారని చమత్కారంగా అన్నారు. ఎన్నికల ఇంచార్జి, రాష్ట్ర టిఎంఆర్ఈఐఎస్ చైర్మన్ ఫయుమ్ ఖురేషీ మాట్లాడుతూ సిఎం కోరిక మేరకు మైనారిటీ చైర్మన్ ను చేయడం జరిగిందన్నారు. ఎన్నికల్లో అభ్యర్థులు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామన్నారు. జహీరాబాద్ మున్సిపల్ లో పాలకమండలి మొత్తం యంగ్ స్టార్లు ఉన్నారని, వార్డుల అభివృద్ధికి పాటుపడాలన్నారు. జహీరాబాద్ గడ్డ కాంగ్రెస్ అడ్డా అని మరోసారి నిరూపితం అయ్యిందన్నారు.
ఎంపి సురేష్ కుమార్ శెట్కార్ మాట్లాడుతూ పార్లమెంట్ పరిధిలో ఎనిమిది మున్సిపాలిటీలలో కాంగ్రెస్ జెండా ఎగరవేయడం సంతోషకరమన్నారు. కష్టపడ్డ కార్యకర్తకు పార్టీలో గుర్తింపు ఉంటుందన్నారు. మాజీ మంత్రి, ఇంచార్జి ఏ.చంద్రశేఖర్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉన్న రెండు మున్సిపల్ లను కాంగ్రెస్ కైవసం చేసుకుందని, గెలుపుకు కృషి చేసిన పార్టీ కార్యకర్తలకు, సహకరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ ఎన్.గిరిధర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఎస్. ఉజ్వల్ రెడ్డి, తన్వీర్,ఆత్మ చైర్మన్ రామలింగారెడ్డి, సిడిసి చైర్మన్ ముభిన్,ఎంఐఎం ఇంచార్జి అత్తర్ అహ్మద్,కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కె. నర్సింలు, పీ. నర్సింహారెడ్డి, హన్మంత్ రావుపాటిల్, బి.శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.