Congress On BRS: కోయ్ కోయ్.. అనే రీల్ ఆదర్శంగా తీసుకున్నారో ఏమో కానీ, కొందరు బీఆర్ఎస్ కార్యకర్తలు మాత్రం ఆ రీల్ బాటలో నడుస్తున్నారట. ఈ మాటలు అంటున్నది మాత్రం కాంగ్రెస్ కార్యకర్తలు. ఎందుకంటే గ్రామసభల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు తెగ కూతలు కూస్తున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు విమర్శలు గుప్పిస్తున్నారు. రేపు ఎక్కడ గ్రామసభ జరుగుతుందో ముందే తెలుసుకుంటున్న బీఆర్ఎస్, తమ కార్యకర్తలకు గ్రామసభ ఎలా రసాభాస చేయాలో కూడ ట్రైనింగ్ కూడ ఇస్తుందని కాంగ్రెస్ లీడర్స్ ఆరోపణలు గుప్పిస్తున్నారు. కొన్ని గ్రామసభల్లో అయితే ప్రజలే, బీఆర్ఎస్ కార్యకర్తలకు క్లాస్ తీసుకుంటున్న ఘటనలు జరుగుతున్నాయి. ఇంతకు కోయ్.. కోయ్ వెనుక ఉన్న అసలు కథ ఇదే.
తెలంగాణ వ్యాప్తంగా జనవరి 26న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా స్కీమ్ లతో పాటు, కొత్త రేషన్ కార్డుల మంజూరుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. అందులో భాగంగా ఇప్పటికే గ్రామసభలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ గ్రామసభల్లో ఇందిరమ్మ గృహాల లబ్ది పొందిన లబ్దిదారుల జాబితాను కూడ అధికారులు ప్రజల ముందుంచుతున్నారు. గ్రామసభల నిర్వహణ వెనుక ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే.. ఎవరైనా అనర్హులు ఉంటే ఫిర్యాదులు స్వీకరించడం, అలాగే అర్హత ఉండి జాబితాలో లేని వారి నుండి దరఖాస్తులు స్వీకరించడమే. సామాన్య ప్రజానీకం మాత్రం గ్రామసభలకు హాజరై పారదర్శకత జాబితా తయారీలో కనిపిస్తుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కూడ ఒక్క విమర్శను కూడ ఎదుర్కోకుండ పక్కాగా జాబితాలు తయారు చేసి సభల్లో ప్రవేశపెడుతున్నారు.
అదే ఇప్పుడు బీఆర్ఎస్ లోని కొందరు కార్యకర్తలకు రుచించడం లేదట. పారదర్శకంగా అర్హులను అధికారులు గుర్తిస్తుంటే, లేదు లేదు అలా జరగడం లేదంటూ గ్రామసభల్లో తెగ హంగామా చేస్తున్నారు. ప్రజలు మాత్రం తమకు పథకంతో లబ్ది చేకూరడంపై ఆనందం వ్యక్తం చేస్తుంటే, బీఆర్ఎస్ అనుకూల మీడియా మాత్రం అర్హతలు లేని ప్రజల వద్దకు వెళ్లడం మీ అభిప్రాయం ఏమిటని అడగడం, దానికి వారు సమాధానం చెప్పడం అదే ప్రచారం సాగిస్తున్నట్లు కాంగ్రెస్ అంటోంది. ప్రభుత్వం ఏమాత్రం దాపరికం పాటించకుండ, ప్రజల ముందే అన్ని జాబితాలను ఉంచి దరఖాస్తులు స్వీకరిస్తుంటే ఇదేం గోల నాయనా అంటూ లబ్దిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట.
ఇలాంటి ఘటనలపై మంత్రి కోమటిరెడ్డి స్పందించారు. ఇలాంటి ఘటనలు తమ దృష్టికి వచ్చాయని, అర్హత ఉంటే దరఖాస్తు చేస్తే చాలు, లబ్ది ఖాయం అన్నారు. గ్రామసభల్లో కొందరు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కావాలనే దురుద్దేశ పూర్వకంగా అలజడి సృష్టిస్తున్నారని అటువంటి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలన్నారు. పథకాలు లేకుంటే పథకాలు ఎక్కడనేది కూడ బీఆర్ఎస్ పార్టీనేనని, ఇప్పుడు గ్రామసభలు నిర్వహిస్తుంటే అడ్డుకొనేది కూడ బీఆర్ఎస్ లీడర్స్ అంటూ మంత్రి అన్నారు.
ఇది ఇలా ఉంటే సభల్లో పాల్గొనే ప్రజలు మాత్రం గ్రామసభల నిర్వహణపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామసభల్లో హంగామా చేసే బీఆర్ఎస్ కార్యకర్తలకు క్లాస్ తీసుకోవాలని ప్రజలు సూచిస్తున్నారు. ఈ పరిస్థితి ఇలాగే ఉంటే బీఆర్ఎస్ కు ప్రజలే బుద్ది చెప్పే రోజు దగ్గరలోనే ఉందని కాంగ్రెస్ అంటోంది. మొత్తం మీద గ్రామసభల్లో కూతలు కోస్తున్న క్యాడర్ కి బీఆర్ఎస్ ఫుల్ స్టాప్ పెట్టేనా? లేక ప్రజల ఆగ్రహానికి గురయ్యేనా అన్నది మున్ముందు తేలుతుందని కాంగ్రెస్ అంటోంది.