Congress: స్వేచ్ఛ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడానికి నాయకులు, కార్యకర్తలు అంకితభావంతో పనిచేయాలని భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, డిసిసి అధ్యక్షులు, ఆలేరు శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ పరిధిలోని నూతన మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల నియామక మహోత్సవం ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి.. నూతనంగా ఎన్నికైన మండల అధ్యక్షులకు నియామక పత్రాలను అందజేసి, వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ చామల మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు శ్రమించే ప్రతి కార్యకర్తకు, నాయకుడికి పార్టీలో ఎల్లప్పుడూ తగిన గుర్తింపు, గౌరవం ఉంటాయని భరోసా ఇచ్చారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అధ్యక్షులు అందరినీ కలుపుకొని పోతూ, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేయాలని కోరారు.
ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వ ధ్యేయమైన సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ చేర్చడంలో కార్యకర్తలు వారధులుగా మారాలన్నారు. రాబోయే రోజుల్లో పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, భారీ సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొని నూతన కమిటీలకు మద్దతుగా నిలిచారు.
Also Read: కేతేపల్లి పోలీస్ స్టేషన్ వద్ద భారీ అగ్నిప్రమాదం.. వాహనాలు దగ్ధం