బండి భగీరథ్ కేసు విషయంలో .. బీజేపీ డ్యామేజీని కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తుంటే.. తగుదునమ్మా అని కాంగ్రెస్ నేతలు అనాలోచిత కామెంట్స్ చేస్తూ బద్నామవుతున్నారు. పార్టీని ఇరుకున పెడుతున్నారు. అదిప్పుడు ఒడిసిన ముచ్చట. ఆ కేసుపై చట్టం తన పని తాను చేసుకుంటూ పోతున్నది. కానీ విలేకరులు అడిగిన ప్రశ్నలకు టెంప్ట్ అయి ఏదో ఒకటి వాగేయడం.. తరువాత నాలుక్కరుచుకోవడం కాంగ్రెస్ నేతలకు అలవాటుగా మారినట్టుంది. మొన్న పొన్నం ప్రభాకర్ ఇలాంటి కామెంట్సే చేసి ట్రోల్స్కు గురయ్యాడు.
అది కుటుంబ పంచాయితీ.. ఆ రెండు కుటుంబాలు కూర్చుని మాట్లాడుకుంటాయో.. పెళ్లి చేసుకుంటామంటారో.. వారిష్టం.. అని ఈయనే పంచాయితీ పెద్దగా తీర్పిచ్చేసినట్టు మాట్లాడేశాడు. దీంతో పొన్నంతో ఆడుకున్నది సోషల్ మీడియా. బాధ్యతాయుత మంత్రి పదవిలో ఉండి .. ఫోక్సో కేసు విషయంలో ఇలాగేనా మాట్లాడేది? అంటు తిట్ల దండకమందుకున్నారు. తాజాగా ఎంపీ మల్లురవి కూడా ఒక అడుగు ముందుకేసీ… ఎహె.. దీన్ని లైట్ తీసుకోండి. పిల్లలంటేనే తప్పు చేస్తారు.. అది కామన్..అన్నట్టుగా మాట్లాడటంతో తెలంగాణ సమాజం భగ్గుమన్నది.
మల్లు రవి పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా కూడా ఉన్నారు.ఇలా క్రమశిక్షణ తప్పి.. నోరు అదుపులేకుండా ఏదో పిచ్చాపాటి మాట్లాడుకున్నట్టు సున్నితమైన ఆ ఇష్యూ మీద మీడియా ముఖంగా వాగడంతో టార్గెట్ అయ్యాడు.ఈ పెద్ద మనుషులకు మతి తప్పిందా? వీళ్లు ప్రెస్ ముందుకు రాకుంటేనే బాగుంటుంది కదా! అని కాంగ్రెస్ శ్రేణులు కూడా దెప్పిపొడవటం మొదలుపెట్టారు. వాస్తవానికి, ఈ కేసులో పార్టీలకతీతంగా ఎవరైనా బండి సంజయ్కు అనుకూలంగా మాట్లాడితే భగ్గుమంటున్నారు. తిట్ల దండకాలు చదవుతున్నారు. వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. మీ ఫ్యామిలీకి ఇలాగే జరిగితే ఇట్లనే స్పందించేవారా? అని మరీ డీప్ కామెంట్స్కు దిగుతున్నారు.
ఇలాంటి సున్నితమైన అంశాలను టచ్ చేయకుండా ఉండాల్సిన కీలక కాంగ్రెస్ నేతలు..మీడియా ఏదో అడగడం.. వీరేదో తీర్పు చెప్పినట్టు.. అదేం పెద్ద కేసు కాదు..లైట్ తీసుకోండనే విధంగా పెద్దరికపు మాటలు మాట్లాడటం పట్ల అంతా విమర్శిస్తున్నారు. భగీరథ్ జైలుకు పోయి.. అదంతా ఒక ప్రాసెస్లో చట్టం తన పనితాను చేసుకుంటూ పోతున్న సమయంలో.. ఈ విషయంపై ఇప్పుడు కాంగ్రెస్ నేతలు తమ సొంత భాష్యాలు పలకడం అవసరమా? అని మండిపడుతున్నాయి గాంధీ భవన్ వర్గాలు. ఈ విషయంలో సీఎంను కూడా వదల్లేదు సోషల్ మీడియా. భగీరథ్ అరెస్టు కాకముందు.. సీఎం రేవంత్రెడ్డి ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో… సంజయే స్వయంగా కొడుకును అప్పగిస్తే మర్యాద దక్కించుకున్నట్టవుతుంది! అని ఓ సూచన చేయడాన్ని కూడా తప్పుబట్టారు.
సీఎం హోదాలో ఉండి..నువ్వు సలహా ఇచ్చుడేందీ? అరెస్టుకు సంబంధించిన చర్యలు చేపట్టి.. ఈ కేసులో మరింత కఠినంగా ఉండాల్సినన సమయంలో.. ఇలాంటి వ్యాఖ్యలు తగునా? అని చాలా మంది రియాక్టయ్యారు. నిజానికి ఇక్కడ పార్టీ అని చూడటం లేదు. బీజేపీ వ్యతిరేకులనీ కాదు.. కానీ కేసు పూర్వపరాలు.. ఓ రాజకీయ నేత కొడుకైతే ఇంత అలసత్వమా? బాధితులకు ఇలాగేనా న్యాయం చేసే పద్దతి..? ఇలాంటి ప్రశ్నలపైనే నిలదీతలు మొదలయ్యాయి. పరిస్థితి తీవ్రతను అంచనా వేసుకుని, సైలెంట్గా తమ పని తాము చేసుకోవాల్సిన నేతలు.. ఇలా వ్యక్తిగతంగా తమ మనసులోని ముచ్చట చెప్పి.. ముచ్చటగా తిట్లు తింటున్నారు.