Minister Seethakka: ములుగు మున్సిపాలిటీలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 20 వార్డుల్లో 12 వార్డులను కాంగ్రెస్ కైవసం చేసుకోగా మరో 2 వార్డుల్లో కాంగ్రెస్ రెబల్స్ విజయం సాధించారు. 5 వార్డుల్లో బీఆర్ఎస్, 1 వార్డులో బీజేపీ గెలుపొందాయి. ఈ సందర్భంగా ములుగు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ తరఫున గెలిచిన కౌన్సిలర్లను మంత్రి సీతక్క అభినందించారు. శాలువాలు కప్పి, స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.
ములుగు మున్సిపాలిటీ ఏర్పడిన తరువాత జరిగిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్కు అపూర్వ విజయం లభించడంపై మంత్రి సీతక్క సంతోషం వ్యక్తం చేశారు. అటు రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన అఖండ విజయంపై హర్షం వ్యక్తం చేశారు. ఇది కేవలం ఒక రాజకీయ పార్టీ గెలుపు మాత్రమే కాదని.. ప్రజల ఆకాంక్షల విజయమని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి విధానాలకు వచ్చిన ప్రజా మద్దతు అని పేర్కొన్నారు.
పట్టణ ప్రజలు కాంగ్రెస్ పార్టీపై ఉంచిన విశ్వాసమే ఈ ఫలితాలకు అసలైన కారణమని మంత్రి సీతక్క అన్నారు. అవినీతి రహిత పారదర్శక పాలన, మౌలిక వసతుల అభివృద్ధి, ప్రజలకు అందుబాటులో ఉండటం వంటి అంశాలు ప్రజల మనసు గెలుచుకున్నాయని వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అమలు చేస్తున్న పథకాలు ప్రజల మన్ననలు పొందాయని మంత్రి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందిన కౌన్సిలర్లు ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేలా పని చేయాలని మంత్రి సీతక్క సూచించారు. ప్రతి వార్డులో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. మరోవైపు పట్టణ ప్రజలు అందించిన ఆశీర్వాదాన్ని బాధ్యతగా స్వీకరిస్తున్నామని రాబోయే రోజుల్లో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంత చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
Also Read: Street Dog: ఫేమస్ స్ట్రీట్ డాగ్ను.. కారుతో తొక్కించిన డ్రైవర్.. పోలీసులు ఏం చేశారంటే?
మున్సిపల్ ఎన్నికలు ఫలితాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మెుత్తం 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగ్గా.. 4 గంటల వరకూ 68 స్థానాల్లో ఫలితాలు వెలువడ్డాయి. వాటిలో అధికార కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఏకంగా 43 మున్సిపాలిటీలో విజయ ఢంకా మోగించింది. విపక్ష బీఆర్ఎస్ కేవలం 9 మున్సిపాలిటీల్లో గెలుపొందగా.. బీజేపీ కనీసం బోణీ కూడా చేయలేకపోయింది. అటు 15 మున్సిపాలిటీల్లో హంగ్ రాగా.. స్వతంత్ర అభ్యర్థులు కీలకంగా మారారు.