Palakurthi MLA: పాలకుర్తి నియోజక వర్గంలో ఎమ్మెల్యేకు సీన్ రివర్స్ అయింది. అసెంబ్లీ ఎన్నికల అప్పుడు అక్కున చేర్చుకున్న
కాంగ్రెస్ శ్రేణులు నేడు నడిరోడ్డుపైనే నిలదీస్తున్నారు. రెండేళ్లలోనే తీవ్ర వ్యతిరేకతతో భగ్గుమంటున్నాయి సొంత పార్టీ శ్రేణులు.. పంచాయితీ ఎన్నికల ప్రచారంలో ఎక్కడికక్కడ నియోజకవర్గ ప్రజలు నిలదీస్తున్నారు.
నర్సింగపురంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ శ్రేణులు ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని నిలదీశారు. పార్టీకి అనుకూలంగా పనిచేసిన, కష్టకాలంలో కాంగ్రెస్కు అండగా నిలిచిన వ్యక్తిని పక్కనపెట్టి, ఎమ్మెల్యేకు నచ్చిన వ్యక్తికే సర్పంచ్ టికెట్ ఇవ్వడంపై కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కోసం పనిచేసిన వారికి న్యాయం చేయకుండా, వ్యక్తిగత ఇష్టాలతో అభ్యర్థులను ఎంపిక చేస్తే ఎలా? అంటూ ఎమ్మెల్యేను ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్కు మద్దతుగా నిలిచిన శ్రేణులను యశస్విని రెడ్డి అప్పట్లో అక్కున చేర్చుకున్నారని, కానీ ఇప్పుడు అదే శ్రేణులు ఆమె పనితీరుపై ప్రశ్నలు సంధిస్తున్నాయని స్థానిక నేతలు అంటున్నారు.
మా అభ్యర్థులను గెలిపిస్తే గ్రామాలను అభివృద్ధి చేస్తాం అని ఎమ్మెల్యే చెప్పడం పట్ల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపిస్తే రెండేళ్లుగా ఏం చేశారు? అంటూ నేరుగా ప్రశ్నిస్తున్నారు. అభివృద్ధి పనులు, హామీల అమలు అంశాలపై స్పష్టమైన సమాధానాలు రాకపోవడంతో అసహనం మరింత పెరుగుతోంది. సమాధానం చెప్పలేక ఆడబిడ్డను అడ్డుకుంటారా అంటూ సెంటిమెంట్ రాగం తీస్తున్నారు ఎమ్మెల్యే.
ఇప్పటికే కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి తీరుతో.. నియోజకవర్గంలోని కీలక కాంగ్రెస్ నేతలు వేరుకుంపటి పెట్టిన పరిస్థితి ఉంది. ఝాన్సీ రెడ్డి అభ్యర్థులకు వ్యతిరేకంగా అసమ్మతి వర్గం సుమారు.. 50 మంది రెబెల్ అభ్యర్థులను బరిలో నిలిపినట్లు సమాచారం.
Also Read: డ్రైనేజీలో BRS బ్యాలెట్ పేపర్స్.. కలెక్టర్ సీరియస్
ఒకవైపు అధికారిక కాంగ్రెస్ అభ్యర్థులు, మరోవైపు రెబెల్ అభ్యర్థులు బరిలో ఉండటంతో గ్రామ పంచాయతీ ఎన్నికలు కాంగ్రెస్కు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. దీనికి తోడు ప్రజల నిలదీతలు, స్వంత పార్టీ కార్యకర్తల తిరుగుబాటుతో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అయోమయంలో పడినట్లు తెలుస్తోంది. ప్రచారంలో ఎటు వెళ్లినా ప్రశ్నలు, విమర్శలే ఎదురవుతుండటంతో పరిస్థితిని ఎలా చక్కదిద్దుకోవాలన్న దానిపై ఆమె వర్గం ఆలోచనలో పడింది.