Palakurthy Constituency: పాలకుర్తి నియోజకవర్గం.. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. ప్రస్తుత యువ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి.. ఈ ఇద్దరి నేతల మధ్య నిత్యం ఏదో ఓ గొడవ.. అయితే వీరద్దిరి లొల్లి పక్కనబెడితే.. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నేతల మధ్యే ఈ నియోజకవర్గంలో తరచూ ఏదో ఓ వివాదం తలెత్తుతోంది. కావాలనే ఎవరైనా కాంగ్రెస్ నాయకుల మధ్య గొడవలు చేయిస్తున్నారా..? లేకుంటే నియోజకవర్గంలో సరైన సీనియర్ సీనియర్ నాయకులు లేక ఇలా అవుతోందా..? అనేది తెలియదు.. కానీ ఇక్కడ ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య సంబంధాలు బలహీనంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఈ అంతర్గత విభేదాలు రాష్ట్రస్థాయిలో చర్చకు దారి తీస్తున్నాయి. తాజాగా తొర్రూరు మండలం చర్లపాలెం గ్రామంలో మరో పంచాయితీ బయటపడింది.
గురువారం పీఎంజీఎస్వై నిధుల బ్రిడ్జిల శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. అయితే గ్రామ పార్టీ అధ్యక్షుడు ఎక్కటి నాగిరెడ్డి, ఉపాధ్యక్షుడు గజ్జి దర్గయ్య, ఇందిరమ్మ కమిటీ అధ్యక్షుడు బీరెల్లి మహేందర్ రెడ్డి, ధర్మారపు మహేందర్ల అనుమతి లేకుండానే కాంట్రాక్టర్ రూ. 30 వేలు తీసుకొని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడు. ఈ కార్యక్రమానికి వరంగల్ ఎంపీ కడియం కావ్య, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు హనుమండ్ల ఝాన్సీ రెడ్డి హాజరయ్యారు. ఫ్లెక్సీలో తమ ఫోటోలు ఉన్నా శంకుస్థాపనకు ఆహ్వానం అందకపోవడంతో ఈ నలుగురు నాయకులు అభ్యంతరం తెలిపారు.
తమ అనుమతి లేకుండా ఫ్లెక్సీలో ఫోటోలు ఎలా వేశారని నాగిరెడ్డి, దుర్గయ్య, మహేందర్ రెడ్డి, ధర్మారావులు హంగామా చేశారు. వేదికపై ఉన్న ఝాన్సీ రెడ్డిని నేరుగా నిలదీశారు. దీంతో నేతలకు ఈ నలుగురికి మధ్య కొంతసేపు వాగ్వాదం నడిచింది. ఝాన్సీ రెడ్డి ఆ నలుగురిపై కోపం వ్యక్తం చేశారు. మరోవైపు అనుమతి తీసుకోకుండా ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన వారిపై కూడా ఝాన్సీ రెడ్డి ఇతర నేతలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఎదురు తిరగడంతో శంకుస్థాపన కార్యక్రమం కాస్త పక్కకు పోయి ఈ వివాదమే ప్రధానాంశం అయింది.
చెర్లపాలెం గ్రామంలో గతంలో కూడా ఇలాంటి ఫ్లెక్సీల వివాదం జరగడం గమనార్హం. పెరటి యాకూబ్ రెడ్డి, హనుమాండ్ల దేవేందర్ తమ ఫోటోలు ఫ్లెక్సీలో పెట్టించేందుకు ప్రయత్నం చేశారు. అప్పుడు ఫ్లెక్సీలు తయారు చేసే నిర్వాహకుడికి ఫోన్ చేసి బెదిరించారని ఎక్కటి నాగిరెడ్డి ఆరోపించారు. ఫ్లెక్సీలో తమ ఫోటోలు పెడితే కేసులు పెడతామని హెచ్చరించినట్లు ఆయన చెప్పారు.
మొత్తంగా పాలకుర్తి నియోజకవర్గం వర్గానికి సంబంధించిన వివాదం మరోసారి రాష్ట్ర స్థాయిలో చర్చకు వచ్చింది. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఒక వర్గానికి కొమ్ముకాస్తున్నారనే, మరో వర్గాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ అంతర్గత కలహాలు కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందిగా మారే అవకాశం ఉంది.
ALSO READ: Gold mining: ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు గని.. లక్షల టన్నుల గోల్డ్.. ఎక్కడో తెలుసా..?