
Dharmapuri : ఎట్టకేలకు జగిత్యాల జిల్లా ధర్మపురి ఎన్నికల స్ట్రాంగ్ రూమ్ తెరచుకుంది. తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో జగిత్యాలలోని వీఆర్కే కళాశాలలోని స్ట్రాంగ్రూమ్ తాళాలను అధికారులు పగులగొట్టారు. ఓట్ల లెక్కింపునకు సంబంధించిన రికార్డులను న్యాయస్థానానికి తరలించారు. కలెక్టర్ సమక్షంలో స్ట్రాంగ్ రూమ్లు తెరిచారని కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. స్ట్రాంగ్రూమ్లోని 4 ట్రంకుపెట్టెల తాళాలు కూడా లేవన్నారు. వాటి తాళాలు కూడా పగులగొట్టారని వెల్లడించారు. అధికారుల చర్యలు అనుమానం కలిగిస్తున్నాయని లక్ష్మణ్ సంచలన ఆరోపణలు చేశారు. అయితే తనకు న్యాయస్థానాలపై నమ్మకం ఉందని స్పష్టం చేశారు.
తెలంగాణలో 2018లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ధర్మపురి ఫలితంపై మాత్రం వివాదం ఏర్పడింది. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు. ఈ వ్యవహారంపై హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల ఫలితంపై పిటిషన్ దాఖలు చేసి నాలుగున్నరేళ్లుగా పోరాటం చేస్తున్నారు. లక్ష్మణ్ దాఖలు చేసిన పిటిషన్పై తెలంగాణ హైకోర్టు ఇటీవల విచారణ చేపట్టింది. ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గ స్ట్రాంగ్ రూమ్ తెరవాలని అధికారులను ఆదేశించింది. దీంతో ఈనెల 10న జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు భద్రపరిచిన స్ట్రాంగ్రూమ్ ను జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా సమక్షంలో తెరిచేందుకు ప్రయత్నించారు. అయితే తాళాలు దొరకలేదు. 3 గదుల్లో రెండోగదిని మాత్రమే ఓపెన్ చేశారు. ఆ స్ట్రాంగ్ రూమ్ వీడియోను తీశారు.
మిగతా రెండు గదుల తాళాలు దొరక్కపోవడంతో పగులగొట్టాలని నిర్ణయించారు. అయితే తాళాలు పగులగొట్టేందుకు కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ కుమార్ అంగీకారం తెలపలేదు. దీంతో తెరిచిన గదితోపాటు మిగతా రెండు గదులకు అధికారులు సీల్ వేశారు.
తెరచిన స్ట్రాంగ్ రూమ్ లో 108 నుంచి 269 పోలింగ్ కేంద్రాల ఓటింగ్ యంత్రాలు భద్రంగా ఉన్నాయి. మిగతా రెండు గదుల తాళాలు లేవన్న విషయాన్ని జిల్లా కలెక్టర్ తెలంగాణ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కేంద్ర ఎన్నికల సంఘం సూచనతో చర్యలు చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు రంగంలోకి దిగి స్ట్రాంగ్ రూమ్ తాళాలు పగులకొట్టారు.
BRS: నా చావు కోసం చూస్తున్నారు.. బీఆర్ఎస్లో ఇంటి దొంగలున్నారు.. సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే కలకలం