Cotton Procurement: తెలుగు రాష్ట్రాలలో మొoథా తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు నేపథ్యంలో పత్తి రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు విజ్ఞప్తి చేశారు. సచివాలయంలో మంగళవారం రైతు నేస్తం కార్యక్రమంలో మంత్రి తుమ్మల మాట్లాడారు. తుపాను ప్రభావంతో చేతి కందిన పత్తి పంట తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తేమ శాతం 12 శాతం మించకుండా చూడాలని కోరారు. మారిన వాతావరణ పరిస్థితులు దృష్ట్యా తేమ శాతం 20 వరకు ఉన్నప్పటికీ పత్తి కొనుగోళ్లు జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసినట్లు మంత్రి తెలిపారు.
వానాకాలం సీజన్ పత్తి కొనుగోళ్లు సీసీఐ ప్రారంభించింది. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా 72 జిన్నింగ్ మిల్లుల్లో కొనుగోళ్లు ప్రారంభం అయ్యాయి. 784 మంది రైతులకు చెందిన 1623 క్వింటాళ్ల పత్తి తొలిరోజు కొనుగోలు చేశారు. పత్తి కొనుగోళ్లకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 318 జిన్నింగ్ మిల్లులు నోటిఫై చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 45 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయగా 28 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి దిగుబడి వస్తుందని అంచనాలు. ఈ ఏడాది అధిక వర్షాల కారణంగా పత్తి దిగుబడులు తగ్గడం, మారిన వాతావరణ పరిస్థితులు దృష్ట్యా తేమ శాతం విషయంలో 12 శాతం పైగా ఉన్న పత్తినీ కూడా కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు జరపాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ చౌహాన్ కు లేఖ రాశారు.
పత్తి రైతులు తేమ విషయంలో 12 శాతం మించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, తేమ విషయంలో అప్రమత్తంగా లేకపోతే మద్దతు ధర దక్కక రైతులు నష్ట పోతారని మంత్రి తుమ్మల తెలిపారు.
పత్తి రైతులు కపాస్ కిసాన్ యాప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసం ప్రభుత్వం ప్రత్యేక అధికారిక బృందాలను నియమించింది. ఈ బృందాలు జిల్లాలో పర్యటించి ఏఈవోలు మార్కెట్ సెక్రటరీలు, జిల్లా మార్కెటింగ్ అధికారులు రైతులకు అందుబాటులో ఉంటారని మంత్రి తుమ్మల తెలిపారు. రైతులు యాప్ లో నమోదు చేసుకుంటే పత్తి అమ్ముకోవడంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయని అన్నారు.
మంగళవారం నుంచి సోయాబీన్ కొనుగోళ్లు చేస్తున్నట్లు మంత్రి తుమ్మల వెల్లడించారు. ప్రైస్ సపోర్ట్ స్కీమ్ లో మొక్కజొన్న జొన్నలు చేర్చాలని సోయాపై ఉన్న పరిమితులు ఎత్తి వేయాలని మంత్రి తుమ్మల కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.
Also Read: Weather News: తెలంగాణపై మొంథా ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో కుండపోత వర్షం, ఈ ప్రాంతాల్లో పిడుగుల వాన
పత్తి రైతులకు ఎలాంటి సమస్యలు తలెత్తినా రైతుల కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1800-599-5779 కి కాల్ చేయొచ్చని మంత్రి తుమ్మల తెలిపారు. పత్తి రైతులు ప్రభుత్వ మద్దతు ధరకు అమ్ముకునేలా అన్ని చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులు పత్తి అమ్ముకునేలా సీసీఐ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఏర్పాట్లు చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.