John Wesley: తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినప్పటికీ కల్లుగీత కార్మికుల కుటుంబాలను ఆదుకునేందుకు ఎలాంటి చర్యలు ఇప్పటివరకు తీసుకోలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ (John Wesley) మండిపడ్డారు. తక్షణమే గీత కార్మికులు, కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 5 లక్షలకు పైగా కల్లుగీత కార్మిక కుటుంబాలు ఉన్నారని, గత రెండేళ్లలో చెట్లెక్కి కిందపడి వృత్తికి దూరమైన కార్మికులు 850 మంది ఉన్నారని, 140 మంది చనిపోయారని, మరో 170 మంది శాశ్వతంగా వికలాంగులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.
వారికి ఇస్తామన్న 5 లక్షలు ఇవ్వలేదని, 14 కోట్ల పెండింగ్లో ఉన్నాయన్నారు. ఎక్స్గ్రేషియా 5లక్షల నుండి 10 లక్షల వరకు పెంచుతామన్న కామారెడ్డి డిక్లరేషన్ హామీ నేటికీ అమలు చేయడం లేదని మండిపడ్డారు. నీరాకేఫ్ను అభివృద్ధి చేసి ఆ కార్మిక కుటుంబాలను ప్రభుత్వం ఆదుకునే బాధ్యతను నిర్లక్ష్యం చేస్తున్నదని మండిపడ్డారు. కార్మికుల పోరాటానికి సీపీఎం మద్దతు అని పేర్కొన్నారు.
తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కార్మికులకు 5 లక్షల నుండి 10 లక్షల వరకు ఇస్తామన్న ఎక్స్ గ్రేషియా అమలు చేయాలని, 14 కోట్లు వెంటనే విడుదల చేయాలని, పెన్షన్ రు.4వేలకు పెంచాలని అట్లాగే నీరా, తాటి ఈత ఉత్పత్తులను అభివృద్ధి చేసి కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని, ఈ బడ్జెట్లో 5వేల కోట్లు కేటాయించడానికి సీఎం అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే కార్మికులు చేసే పోరాటాలకు పూర్తిగా మద్దతునిస్తూ అవసరమైతే ప్రత్యక్ష పోరాటాలకు కూడా సీపీఎం పార్టీ సిద్ధమవుతుందని తెలిపారు.