Cyber Refund: స్వేచ్ఛ బ్యూరో: జాతీయ లోక్ అదాలత్ సైబర్ క్రిమినల్స్ ఉచ్ఛులో చిక్కుకుని డబ్బు పోగొట్టుకున్న వారికి భారీ ఊరటనిచ్చింది. 4,627కేసుల్లో బాధితులకు 24.91 కోట్ల రూపాయలను రీఫండ్ చేసింది. తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, వేర్వేరు బ్యాంకులు, డిజిటల్ పేమెంట్ సంస్థలతో సమన్వయం ఏర్పరుచుకుని ఈ విజయాన్ని సాధించినట్టు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ చెప్పారు. ఏయేటికాయేడు పెరిగిపోతున్న సైబర్ నేరాలకు చెక్ పెట్టటంతోపాటు కేటుగాళ్ల వలలో చిక్కి డబ్బు పోగొట్టుకున్న బాధితులకు స్వాంతన కలిగించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.
ఈ సంవత్సరం మొదటి మూడు నెలల్లోనే రికార్డు స్థాయిలో సైబర్ క్రిమినల్స్ కొల్లగొట్టిన 5.64కోట్ల రూపాయలను రికవరీ చేసి 87మంది బాధితులకు తిరిగి ఇచ్చినట్టు వివరించారు. మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో 832మంది బాధితులకు 4.79కోట్లు, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 553మంది బాధితులకు 3.99కోట్లు రీఫండ్ చేసినట్టు తెలిపారు. సైబరాబాద్, సంగారెడ్డి యూనిట్లలో 1.52 కోట్ల రూపాయల చొప్పున బాధితులకు తిరిగి ఇప్పించినట్టు వివరించారు. లోక్ అదాలత్ వంటి వ్యవస్థీకృత మార్గాల ద్వారా బాధితులకు సత్వర న్యాయం అందించటాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు.
Also Read: ఆ తేదీలో పుట్టిన వారికి భవిష్యత్తు ముందే తెలుస్తుందట
సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 53,434 మంది బాధితులకు రూ. 399.06 కోట్ల మొత్తాన్ని రీఫండ్ చేసినట్టు వెల్లడించారు. 2023లో 8.3 కోట్లుగా ఉన్న రీఫండ్ విలువ, 2024లో 183.9 కోట్లకు, 2025లో 183 కోట్లకు పెరిగిందన్నారు. ప్రస్తుతం 2026లో కేవలం మూడు నెలల్లోనే రూ. 24.91 కోట్లు సాధించడం సిబ్బంది నిరంతర కృషికి దక్కిన విజయమన్నారు. యూపీఐ మోసాలు, పెట్టుబడి పథకాల పేరుతో జరిగే స్కామ్లు, ఐడెంటిటీ ఫ్రాడ్స్ వంటి వాటిపై బ్యాంకులు మరియు న్యాయవ్యవస్థతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ రీఫండ్ ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని వివరించారు.
ఇక, ప్రజలు కూడా సైబర్ జాగ్రత్తలు పాటించాలని శిఖా గోయల్ విజ్ఞప్తి చేశారు. గుర్తు తెలియని వ్యక్తులకు ఓటీపీలు, పిన్ నంబర్లు, బ్యాంకింగ్ వివరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ షేర్ చేయవద్దని సూచించారు. కేవలం అధికారిక వెబ్సైట్ల ద్వారానే కస్టమర్ కేర్ నంబర్లను ధృవీకరించుకోవాలన్నారు. అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని తెలిపారు. ఒకవేళ మోసపోతే 1930 నెంబర్కు ఫోన్ చేయాలని సూచించారు. దాంతోపాటు సైబర్ క్రైమ్ వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలన్నారు. నేరం జరిగిన మొదటి గంటలో ఫిర్యాదు చేస్తే బాధితులు పోగొట్టుకున్న డబ్బును రికవరీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు.
Also read: తెలంగాణ పాలిటిక్స్లో బిగ్ బాంబ్.. 2029 నాటికి రాష్ట్రంలో కొత్త రాజ్యాలు..?