తెలంగాణ సాగునీటి అంశంపై ఈ మధ్య కవిత లోతుగా విశ్లేషిస్తున్నారు. పదేళ్ల బీఆరెస్ పాలనలో సాగునీటి ప్రాజెక్టులకు జరిగిన అన్యాయంతో పాటు, అవినీతి అక్రమాలను బహిర్గత పరుస్తున్నారు. దీనికి పరిష్కారమార్గంగా ఉద్యమాల రూపకల్పనకు సంబంధించిన కార్యాచరణను కూడా ప్రకటిస్తున్నారు. పార్టీ పెట్టిన తరువాత ఏర్పాటు చేసిన తొలిసభనే పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు సాధన సభగా డిసైడ్ చేయడంలోనే ఆమె ఎంచుకున్న లక్ష్యం జనాలకు అర్థమైపోయింది. తెలంగాణకు కీలకమైన సాగునీటి రంగంపై వివక్ష, నిర్లక్ష్యం.. అవినీతిపై ఆమె జంగ్ సైరన్ ఊదుతున్నారు. అయితే ఇవాళ ఆమె మాట్లాడిన సాగునీటి అంశంలో భాగంగా చెక్డ్యాంల ఇష్యూను కూడా టచ్ చేశారు. తాము అధికారంలోకి రాగానే వ్యవసాయ రంగానికి, సాగునీటి అవసరాల కోసం ఏమేమి చేస్తామో వివరించే క్రమంలో చెక్ డ్యాంలను కూడా నిర్మిస్తామని ఆమె చెప్పారు.
వెంటనే బీఆరెస్ పాలనలో ఫోటోలుకు ఫోజులిచ్చి.. ఆ తరువాత కొట్టుకుపోయే చెక్ డ్యాంలను మేం నిర్మంచమని ఆమె పరోక్షంగా మాజీ మంత్రి ప్రశాంత్రెడ్డిని విమర్శించారు. బాల్కొండ నియోజకవర్గంలో కప్పలవాగుపై కోట్లాది రూపాయలతో ప్రశాంత్రెడ్డి చెక్ డ్యాంలను నిర్మించాడు. దీనికి కాంట్రాక్టర్గా కుంట రమేశ్రెడ్డి అని ఆయన బంధువే ఉన్నారు. మాజీ మంత్రి , బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డికి కూడా ఆయన బంధువే. ఈ కాంట్రాక్టర్ చేత కోట్లాది రూపాయలన నిధులను విడుదల చేయించుకుని చెక్ డ్యాంలను నిర్మించారు.
అవి వరదకు మొత్తం కొట్టుకుపోయాయి. నాణ్యతా లోపం.. పరిధికి మించి ఎత్తును పెంచి నిర్మించడం.. తదితర కారణాలతో కోట్ల రూపాయలు వరదనీటిలో కొట్టుకుపోయినట్టయ్యాయి. ఆమె గతంలోనూ ప్రశాంత్రెడ్డిని టార్గెట్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఎస్సారెస్పీ పునరుజ్జీవం పథకంలో భాగంగా వరదకాలువ ద్వారా రివర్స్ పంపింగ్ ద్వారా ప్రాజెక్టును నింపేందుకు దాదాపు రూ. 1200 కోట్లు ఖర్చు చేశారు. దీని ద్వారా ఇప్పటి వరకు ఒక్క చుక్క నీరు కూడా ఎస్సారెస్పీకి చేరలేదని, ఈ నిధులన్నీ కాంట్రాక్టర్ల జేబుల్లోకి పోయాయని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. తాజాగా ఈ చెక్డ్యాం ఇష్యూను కూడా ఆమె టచ్ చేయడం ఇప్పుడు నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో చర్చకు తెరలేపింది.
అక్కడ ఫామ్హౌజ్ రాజకీయాలు కూడా నిరంతరం కవిత వేసే ప్రతి అడుగు.. ప్రతి మాటనూ పరిశీలిస్తున్నది. ఎటువంటి కౌంటర్ ఇయ్యకున్నా… ఆమె రాజకీయ వ్యూహం.. చేసే ఆరోపణలపై నిఘా వేసినట్టుగా గమనిస్తున్నారు ఫామ్హౌజ్ నేతలు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కవిత చేసే ఆరోపణలను ఎలా తిప్పికొట్టాలో తెలియక సైలెంట్గా చూస్తుండి పోయారు. కీలకమైన సాగునీటి రంగంపై పదేళ్ల పాలనలో తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించడం రాజకీయాల్లో తీవ్ర చర్చకు తెర తీసింది. ఇప్పుడామె పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు సాధనలో భాగంగా లక్ష్మీదేవీపల్లిలో రిజార్వాయర్ నిర్మించాలని, దీనికి ప్రభుత్వానికి దసరా వరకు డెడ్ లైన్ విధించడం కూడా చర్చనీయాంశమైంది. ఆ తరువాత ఆమె పాదయాత్ర చేపడతానని కూడా ప్రకటించి ఉన్నారు. దీంతో ఇప్పుడు రెండు పార్టీల్లో కూడా సాగునీటి రంగాలు, వనరులు, నదీ జలాల వాటాల పంచాయతీ, పెండింగ్ ప్రాజెక్టులపై చర్చ జరుగుతోంది.