Telangana News Today: పదేళ్ల ప్రత్యేక రాష్ట్రం. బంగారు తెలంగాణం. ఎన్నికల ఏడాది కావడంతో మరింత ప్రత్యేకం. అట్టహాసంగా తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు జరిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. 21 రోజుల పాటు రాష్ట్ర, దేశ వ్యాప్తంగా ధూంధాంగా కార్యక్రమాలు నిర్వహించబోతోంది. అందుకు తగ్గట్టే.. ఆకర్షణీయమైన లోగోను రూపొందించారు.
ప్రత్యేక ఇంట్రెస్ట్తో తయారు చేసినట్టుంది ఈ లోగో. తెలంగాణ తల్లి విగ్రహం చుట్టూ ప్రభుత్వ ప్రాధాన్య పథకాలు వచ్చేలా లోగోను రెడీ చేశారు. నీటిపారుదల ప్రాజెక్టులు, మిషన్ భగీరథ, ఉచిత విద్యుత్, రైతుబంధు, సచివాలయం, అంబేడ్కర్ విగ్రహం, అమరుల స్మారక జ్యోతి, యాదాద్రి ఆలయం, మెట్రో రైల్, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, టీహబ్, పాలపిట్ట, బోనాలు, బతుకమ్మ తదితరాలను లోగోలో పొందుపరిచారు. ఈ లోగోను సీఎం కేసీఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తదితరులు ఆవిష్కరించారు.
జూన్ 2 నుంచి 21 రోజుల పాటు తెలంగా దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. సీఎస్ శాంతికుమారి ఆధ్వర్యంలో ఉత్సవాల కమిటీని ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో సచివాలయంలో మొదటి రోజు ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అదే రోజు మంత్రులు జిల్లా కేంద్రాల్లో ఉత్సవాలను ఆరంభిస్తారు.
తెలంగాణ అమరవీరులను స్మరిస్తూ నివాళులర్పించడంతో పాటు.. మూడు వారాల పాటు అనేక కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఆటపాటలు, పిండి వంటలు, కళాకారులతో ప్రదర్శనలు, కవి సమ్మేళనాలు, జానపదాలు, మ్యూజిక్ షోలు.. తదితర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పదేళ్ల వేడుకను ధూంధాంగా జరపనుంది తెలంగాణ సర్కారు.