Deputy CM Bhatti Vikramarka: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను సరిచేస్తూ సాధ్యమైనంత త్వరగా పెండింగ్ బిల్లులను క్లియర్ చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు స్పష్టం చేశారు. శుక్రవారం శాసనమండలిలో సభ్యుడు ఏవీఎన్ రెడ్డి తదితరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సవివరంగా సమాధానమిచ్చారు.
గత ప్రభుత్వం ఉద్యోగులకు 18వ తేదీ వరకు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉండేదని, దీనివల్ల ఈఎంఐలు (EMI) కట్టలేక ఉద్యోగులు డిఫాల్టర్లుగా మారేవారని భట్టి గుర్తుచేశారు. ఆ పరిస్థితిని మార్చి, తాము అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రతి నెలా 1వ తేదీనే జీతాలు చెల్లిస్తున్నామని తెలిపారు. ఉద్యోగులు ప్రైవేటు వ్యక్తుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు చేయకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
గత ప్రభుత్వం ఆర్థిక భారాన్ని వాయిదా వేసేందుకే ఉద్యోగుల పదవీ విరమణ వయసును మూడేళ్లు పెంచిందని డిప్యూటీ సీఎం విమర్శించారు. వయసు పెంచకపోతే 2021-23 మధ్య 26,854 మంది రిటైర్ అయ్యేవారని, కానీ పెంపు వల్ల కేవలం 6,354 మంది మాత్రమే రిటైర్ అయ్యారని గణాంకాలతో సహా వివరించారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేకే ఈ నిర్ణయం తీసుకున్నారని, వాస్తవం తెలియక నాడు ఉద్యోగులు పాలాభిషేకాలు చేశారని ఎద్దేవా చేశారు.
2023 డిసెంబర్ నాటికి గత ప్రభుత్వం రూ. 43,154 కోట్ల బకాయిలు పెట్టి వెళ్లిందని, అందులో ఉద్యోగుల బకాయిలే రూ. 4,575 కోట్లు ఉన్నాయని శ్వేతపత్రంలో చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. తమ ప్రభుత్వం వచ్చాక రూ. 1,752 కోట్ల పెన్షన్ బెనిఫిట్స్ చెల్లించామన్నారు. ఉద్యోగుల బకాయిల క్లియరెన్స్ కోసం ప్రతి నెలా రూ. 700 కోట్లకు తగ్గకుండా విడుదల చేస్తున్నట్లు తెలిపారు.
మెడికల్ బిల్లులను పెండింగ్లో పెట్టడం అమానవీయమని భావించి, ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న రూ. 200 కోట్ల బిల్లులను పూర్తిగా క్లియర్ చేశామన్నారు. అలాగే రూ. 560 కోట్ల సప్లిమెంటరీ జీతాల బకాయిలను కూడా చెల్లించామని, ఇకపై ఏ నెలకు ఆ నెల బిల్లులు క్లియర్ చేస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగుల కోసం కొత్త హెల్త్ స్కీమ్ను వారే డిజైన్ చేసుకోవచ్చని, సమస్యల పరిష్కారానికి ‘జాయింట్ స్టాఫ్ కౌన్సిల్’ను కూడా ఏర్పాటు చేశామని భట్టి వివరించారు.