Bhatti Vikramarka: ప్రత్యర్థులు చేస్తున్న ఆరోపణలను తిప్పికొడుతూ, తన జీవితం ఒక తెరిచిన పుస్తకమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రజా భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో సింగరేణి టెండర్ల వివాదం, తన రాజకీయ ప్రస్థానంపై డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు.
“సింగరేణి తెలంగాణ ప్రజల ఆత్మ. దానిని కాపాడి భవిష్యత్తు తరాలకు అందించడమే నా ఏకైక లక్ష్యం. రాజకీయాల్లోకి నేను అక్రమంగా వ్యాపార సామ్రాజ్యాలు సృష్టించుకోవడానికి రాలేదు.ష అని అన్నారు.సమాజంపై పడి పీక్కుతింటున్న ‘గద్ద’ల నుండి ప్రజలను రక్షించడమే తన లక్ష్యమని, 40 ఏళ్ల రాజకీయ జీవితంలో తాను ఎప్పుడూ ప్రజల పక్షానే నిలబడ్డానని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
టెండర్ నిబంధనలను సింగరేణి బోర్డు ఖరారు చేస్తుందని, అందులో మంత్రికి ఎలాంటి సంబంధం ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఆరోపణలు వచ్చిన వెంటనే, పారదర్శకత కోసం సదరు టెండర్లను రద్దు చేయాలని బోర్డుకు సూచించినట్లు వెల్లడించారు.
వ్యక్తుల వ్యక్తిత్వాన్ని కించపరిచే హక్కు ఎవరికీ లేదని, తాను మంత్రిగా ఉన్నంత కాలం తెలంగాణ ఆస్తులపై పడే దోపిడీదారులను, క్రిమినల్స్ను అడ్డుకుంటానని హెచ్చరించారు.తమ కేబినెట్ మొత్తం రాష్ట్ర ప్రజల విస్తృత ప్రయోజనాల కోసమే పని చేస్తోందని, దోపిడీకి వ్యతిరేకంగా పోరాడే వర్గాలకు తాము అండగా ఉంటామని భట్టి వివరించారు.
ఎవరో రాసిన కట్టుకథలను తాను పట్టించుకోనని, పారదర్శకత కోసం సదరు టెండర్లను రద్దు చేయాలని ఇప్పటికే సింగరేణి బోర్డును ఆదేశించినట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిపై ఉన్న కోపంతోనే కొందరు తనను లక్ష్యంగా చేసుకుని దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏవైనా అపోహలు ఉంటే తాను, ఏబీఎన్ రాధాకృష్ణ మాట్లాడుకుంటామని, కానీ వ్యవస్థల ప్రతిష్ట దెబ్బతినకూడదనే ఉద్దేశంతోనే టెండర్ల రద్దుకు నిర్ణయం తీసుకున్నానని భట్టి స్పష్టం చేశారు.
Read Also: వైసీపీ నేతలకు స్ట్రాంగ్ కౌంటర్, ఊర్లో లేనప్పుడు రచ్చ చేస్తారా? ఎమ్మెల్యే దగ్గుపాటి