నిజామాబాద్ జిల్లా బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి రాజకీయ వ్యూహం బెడిసి కొట్టిందా? బిల్లులు రావడం లేదనే నెపంతో ఏకంగా రచ్చకెక్కి సర్కార్ను బద్నాం చేసేలా ఆయన చేసిన హంగామాతో ఫలితం దక్కకపోగా.. గ్యాప్ను పెంచిందా? అంటే అవుననే సమాధానమే వస్తున్నది. బీఆరెస్ పార్టీ నుంచి గెలిచినా.. ఆయన తన నియోజకవర్గ అభివృద్ధి కోసమని కాంగ్రెస్లో చేరారు. ప్రభుత్వ సలహాదారుగా ఆయనకు కాంగ్రెస్ అవకాశం కల్పించింది.
ఆయన తాజాగా తన నియోజకవర్గంలోని సిద్దాపూర్ రిజార్వాయర్ పనులు ఆగిపోయాయని, బిల్లులు చెల్లించడం లేదనే ఇష్యూని రచ్చ చేశారు. అక్కడే స్పాట్లో తిష్టవేసి.. సర్కార్ తనను పట్టించుకోవడం లేదని, మంత్రులు ఫోన్లు లేపడం లేదని ఘాటు.. ఇది సర్కార్ నడిపే తీరేనా? ఇవేం రాజకీయాలు.. లాంటి మాటలు కాంగ్రెస్ పెద్దలను ఇబ్బందికి గురి చేశాయి. దీనిపై టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ కూడా అదే స్థాయిలో స్పందించారు. కేసీఆర్ చేసిన అప్పుల నుంచే బయటపడలేకపోతున్నామని, కొంచెం ఓపిక పట్టాలని నేరుగా చెప్పేశారు. బ్లాక్మెయిలింగ్ దోరణిలో అలా బయటకు వచ్చి .. ఇంటి పరువును రచ్చకీడిస్తే పెద్దగా పట్టింపు కూడా ఉండదనే విషయాన్ని ఆయన చెప్పకనే చెప్పినట్టయ్యింది.
అయితే ఇప్పుడుఈ టాపిక్ కాంగ్రెస్ పార్టీలోని మిగితా ఎమ్మెల్యేల వద్ద చర్చకు వస్తోంది. కాంగ్రెస్ సర్కార్ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు మిగిలిన నియోజకవర్గాలతో పోల్చితే బాన్సువాడకే అత్యధికంగా నిధులు ఇచ్చారట. దాదాపు ఇప్పటి వరకు రూ. 40 కోట్ల నుంచి రూ. 50 కోట్ల వరకు బిల్లులు పేమెంట్ జరిగినట్టు లెక్క తేలిందట. తామకు అంత మొత్తంలో కూడా బిల్లులు చెల్లించలేదని, పోచారం పెద్ద మనిషిగా, సీనియర్ లీడర్గా సీఎం గౌరవమిచ్చి అడిగిన వెంటనే నిధులు కేటాయయించినా.. ఇంకా ఇంకా కావాలని అడగడంతో పాటు… స్పందన లేదని ఏకంగా రచ్చకెక్కడం మర్యాదగా లేదనే విషయాన్ని మిగిలిన కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తప్పుబడుతున్నారు.
ఇప్పుడు ఇదే విషయం గాంధీభవన్ వద్ద చర్చకు వస్తోంది. గతంలో బీఆరెస్ పాలనలో ఇబ్బడిముబ్బడిగా నిధులు తెచ్చుకున్నారని, ఇప్పుడు అలాగే నడవాలని, అదే విధంగా తన మాట చెల్లుబాటు కావాలని పోచారం భావించడమే పొరపాటుగా మారింది. అవును.. అప్పటి పరిస్థితులు వేరు.. ఇప్పుడు పార్టీ, ప్రభుత్వం, నిధుల కొరత, ప్రయార్టీ ఇవన్నీ చూసుకుని పోవాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ఏర్పడింది. ఈ విషయాలను అన్నింటినీ దగ్గరగా చూసిన పోచారం .. పరిస్థితులను అర్థం చేసుకోకుండా రచ్చకెక్కి సర్కార్ పరువును తీసేలా వ్యవహరించడాన్ని తప్పుబడుతున్నది అధిష్టానం.
ఒకవేళ ఆయన మళ్లీ బీఆరెస్లోకి పోయినా పెద్దగా సర్కార్కు వచ్చే నష్టమేమీ లేదనే కోణంలో కొందరు సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పోచారంపై మండిపడుతున్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఇబ్బందిగా మారిన అక్కడి ఇంచార్జి ఏనుగు రవీందర్ రెడ్డిని కూడా సీఎం కట్టడి చేశారు. ఎమ్మెల్యేగా తన విధులు తనను చేసుకోనివ్వాలని, అడ్డం పడొద్దని సూచించిన విషయాన్ని ఇప్పుడు ఆ పార్టీ ఎమ్మెల్యేలు గుర్తు చేస్తున్నారు. ఇలాంటి నేతలను అవసరం లేకున్నా పార్టీలోకి ఆహ్వానించి పరువు తీసుకోవడమెందుకు? అనే దాకా చర్చ వచ్చినట్టు తెలిసింది. ఈ విషయంలో అధిష్టానం సైలెంట్గానే ఉంది. కానీ పోచారం చర్యలపై మాత్రం గుర్రుగానే ఉన్నట్టు తెలుస్తోంది.