మున్సిపల్ ఎన్నికల కోసం అధికార కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమైంది. ఇప్పటికే అధిష్టానం పలుమార్లు జిల్లా ఇన్ చార్జిలతో సమావేశమై ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై వారికి క్లియర్ కట్గా ఆదేశాలు పాస్ చేసింది. మొన్నటివరకు అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ సైతం ప్రస్తుతం రాష్ట్రానికి చేరుకున్నారు. తాజాగా ఆయన జిల్లాల పర్యటనల్లో బిజీగా మారారు. ఇవాళ నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడలో పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం అక్కడి సభలో ప్రసంగించనున్నారు. అభివృద్ధి, సంక్షేమానికి ఓటు వేసి గెలిపించాలని కోరనున్నట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఆయన పర్యటన ప్రాధాన్యతను సంతరించుకున్నది.
మున్సిపల్ ఎన్నికల్లో వందకు పైగా మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు గెలుచుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. ఇదే విషయమై ఇప్పటికే పార్టీ నేతలకు సలహాలు, సూచనలు ఇచ్చింది. ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి? ఓటర్లను ఎలా మచ్చిక చేసుకోవాలి? సంక్షేమం, అభివృద్ధిని ఎలా వివరించాలో కూడా వారికి తెలిపింది. దీనికి తోడు జిల్లా ఇన్చార్జి మంత్రులు ఎన్నికల పోలింగ్ అయిపోయేదాక క్షేతస్థాయిలోనే ఉండనున్నారు. స్థానిక లీడర్లను సమన్వయం చేసుకుంటూ వారు ప్రచారంలో పాల్గొనున్నారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత తొలిసారి పార్టీ గుర్తుపై జరుగుతున్న ఎన్నికలు కావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది.
ఒకవేళ ఈఎన్నికల్లో నెగెటివ్ ఫలితాలు వస్తే జనాల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం లేకపోలేదు. అందుకే సీఎం రేవంత్ సైతం ఈ ఎన్నికలను సీరియస్గా తీసుకున్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ ఓట్లు చీలకుండా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రులను ఆదేశించారు. సర్పంచ్ ఎన్నికల్లో జరిగిన పొరపాటును రిపీట్ కానివొద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. రెబల్ అభ్యర్థులు బరిలో లేకుండా చూసుకోవాలని, వారి బుజ్జగించాలని, నామినేటెడ్ పదవుల్లో అవకాశం ఇస్తామని వారికి భరోసానివ్వాలని సీఎం రేవంత్ ఆదేశించినట్టు తెలుస్తున్నది. దీనికితోడు ఎన్నికలు ముగిసే వరకు మంత్రులు ఎవరూ తమకు కేటాయించిన నియోజకవర్గాలను విడిచి రావొద్దని సూచించినట్టు సమాచారం. గెలుపు బాధ్యతలు పూర్తిగా మంత్రులదే అని సీఎం నొక్కి చెప్పినట్టు తెలుస్తున్నది. ఓటమి పాలైతే అందుకు బాధ్యులను సైతం మంత్రులనే చేస్తానని చెప్పినట్టు సమాచారం.
Congress : అది మాత్రం జరగద్దు.. కాంగ్రెస్ నేతలకు సీఎం అల్టిమేటం!
ఇదిలాఉండగా, ఈసారి మెజార్టీ మున్సిపల్,కార్పొరేషన్ స్థానాలను దక్కించుకుని పార్టీ జెండాను ఎగరేయాలని సీఎం రేవంత్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకు అనుగుణంగానే బలమైన అభ్యర్థులను బరిలోకి దింపాలని జిల్లా స్థాయి నేతలకు అధిష్టానం ఆదేశాలు పాస్ చేసింది. ఓటర్ల నాడీ ఏంటో తెలుసుకునేందుకు సీఎం రేవంత్ రహస్యంగా సర్వే రిపోర్టులు సైతం తెప్పించుకుంటున్నట్టు తెలుస్తున్నది.ఈ క్రమంలో ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సర్వే ఫలితాలు కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్నాయని.. ఇంకొంచెం కష్టపడితే పార్టీకి భారీ విజయం దక్కుతుందని ఆయన మంత్రులకు సూచించినట్టు సమాచారం. ఈ క్రమంలోనే మంత్రులు సైతం ఇప్పటికే తమకు కేటాయించిన నియోజకవర్గ స్థాయిలో వరుస పర్యటనలు చేస్తున్నట్టు తెలుస్తున్నది.