DS : సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. ఆయన కుమారుడు, నిజామాబాద్ మాజీ మేయర్ సంజయ్ కూడా కాంగ్రెస్ కుండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే.. డీఎస్ ను పార్టీలోకి ఆహ్వానించారు.
డీఎస్ కాంగ్రెస్లో చేరికపై ట్విస్ట్ చోటుచేసుకుంది. కాంగ్రెస్లో చేరడం లేదంటూ ముందుగా డీఎస్ పేరుతో ఓ లేఖ విడులైంది. ఆ తర్వాత కాసేపటికే కాంగ్రెస్లో చేరుతున్నట్లు డీఎస్ స్వయంగా ప్రకటించారు. వీల్చైర్లో గాంధీ భవన్కు వచ్చారు. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే , పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, వి.హనుమంతరావు.. డీఎస్కు కాంగ్రెస్ కండువా కప్పారు. డీఎస్ను ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి , కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి , సీనియర్ నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీ ఇతర ముఖ్య నేతలు పార్టీలోకి ఆహ్వానించారు. రాహుల్కు మద్దతిచ్చేందుకే కాంగ్రెస్ లో తిరిగి చేరుతున్నానని డీఎస్ చెప్పారు. రాహుల్పై అనర్హత వేటువేసే వారికి అసలు అర్హత ఉందా? అని ప్రశ్నించారు. రాహుల్ ఊహించిన దానికంటే గొప్పగా పనిచేస్తున్నారని డీఎస్ ప్రశంసించారు.
కొంతకాలంగా ధర్మపురి సంజయ్ కాంగ్రెస్ లో చేరికపై సందిగ్ధత నెలకొంది. డీఎస్ తనయుడి చేరికను జిల్లా కాంగ్రెస్ నాయకత్వం వ్యతిరేకించింది. కానీ తండ్రి చొరవతో సంజయ్ చేరికకు మార్గం సుగమమైంది. గతంలో డీఎస్తోపాటుగా సంజయ్ బీఆర్ఎస్లో చేరారు. కొంతకాలంగా బీఆర్ఎస్కు దూరంగా ఉంటున్నారు. 2004కు ముందు సంజయ్ శాంకారి విద్యా సంస్ధలను పర్యవేక్షించేవారు. ఉమ్మడి రాష్ట్రంలో డీఎస్ మంత్రిగా ఉండగా నిజామాబాద్ మున్సిపాల్టీ నుంచి కార్పొరేషన్ గా మారింది. ఆ సమయంలో తండ్రి రాజకీయ వారసుడిగా తొలుత నిజామాబాద్ మేయర్ గా సంజయ్ ఎన్నికయ్యారు. అక్కడే నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది.
మరోవైపు రాహుల్ గాంధీపై వేసిన ఎంపీ అనర్హత వేటుకు నిరసనగా ఆదివారం గాంధీ భవన్లో రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీహెచ్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సంపత్ కుమార్, కోదండరెడ్డి, వేం నరేందర్ రెడ్డి, రేణుకా చౌదరి, ఇతర ముఖ్యనేతలు నేతలు దీక్ష చేపట్టారు. సాయంత్రం 5 గంటల వరకు ఈ ఆందోళన కొనసాగుతుంది.