GHMC, Property Tax: స్వేచ్ఛ, బ్యూరో: కోర్ అర్బన్ రీజియన్ లోని ప్రజలకు పౌర, అత్యవసర సేవలందించే మూడు మున్సిపల్ కార్పొరేషన్లలో వచ్చే నెల 1వ తేదీ నుంచి ఎర్లీ బర్డ్ స్కీమ్ అమలు కానుంది. రానున్న ఆర్థిక సంవత్సరం (2026-27)కు సంబంధించిన ప్రాపర్టీ ట్యాక్స్ మొత్తాన్ని ముందస్తుగా చెల్లించే వారికి అయిదు శాతం రాయితీ ఇస్తూ అమలు చేయనున్న ఈ స్కీమ్ ను గతంలో మాదిరిగా ఒకే నెలకు కాకుండా ఈ సారి రెండు, మూడు నెలలు అమలు చేయాలని సర్కారు భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే జీహెచ్ఎంసీ పరిధిలో వేల కోట్లలో పేరుకుపోయిన మొండి బకాయిలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిలను వసూలు చేసుకునేందుకు అధికారులెన్ని ప్రయత్నాలు చేసినా ఫలించకపోవటం, మొండి బకాయిలను వసూలు చేసుకునేందుకు డిసెంబర్ నుంచి అమల్లోకి తెచ్చిన వన్ టైమ్ సెటిల్ మెంట్ (ఓటీఎస్) తో కూడా ఆశించిన స్థాయి ట్యాక్స్ కలెక్షన్ కాకపోవటంతో రానున్న ఆర్థిక సంవత్సరంలోనైనా ఎర్లీ బర్డ్ స్కీమ్ ను మూడు నెలల పాటు కొనసాగించాలని మున్సిపల్ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం.
అంతేగాక, ముందస్తుగా వార్షిక పన్ను చెల్లించే వారికి ఏళ్ల నుంచి ఇస్తున్న రాయితీని అయిదు శాతం మాత్రమే ఇస్తుండగా, ఈ శాతాన్ని కూడా పెంచితే ట్యాక్స్ కలెక్షన్ ఆశించిన స్థాయిలో జరిగే అవకాశముందని మున్సిపల్ శాఖ సర్కారుకు పంపిన ప్రతిపాదనల్లో పేర్కొన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ స్కీమ్ కింద ఇస్తున్న అయిదు శాతం రాయితీని ఏడు శాతానికి పెంచి, మొదటి నెల చెల్లించే బకాయిదారులకు ఏడు శాతం రాయితీ ఇచ్చి, ఆ తర్వాత రెండో మాసంలో చెల్లించే వారికి అయిదు, మూడో నెలలో చెల్లించే బకాయిదారులకు మూడు శాతం రాయితీని కల్పిస్తే ఎక్కువ మొత్తంలో వార్షిక పన్నును ముందస్తుగా వసూలు చేసుకోవచ్చునని మున్సిపల్ శాఖ ప్రతిపాదనల్లో పేర్కొన్నట్లు సమాచారం. గతంలో జీహెచ్ఎంసీ ఎర్లీ బర్డ్ స్కీమ్ ను కేవలం నెల రోజులు అమలు చేస్తే 2024-25 ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ. 800 కోట్ల మేరకు, ఆ తర్వాత ఆర్థిక సంవత్సరం 2025-26లో, వర్తమాన ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ. 900 కోట్ల వరకు ఎర్లీ బర్డ్ కలెక్షన్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27)లో ఎర్లీ బర్డ్ స్కీమ్ ను కనీసం మూడు నెలలు అమలు చేస్తే మొత్తం వార్షిక పన్నును ముందస్తుగానే రూ. 1500 కోట్ల నుంచి రూ. 2 వేల కోట్ల వరకు వసూలు చేసుకునే అవకాశముందని అధికారవర్గాలు భావిస్తున్నట్లు సమాచారం.
కోర్ అర్బన్ రీజియన్ లోని జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఒకే ప్రాపర్టీ ట్యాక్స్ యూనిఫామ్ విధానాన్ని అమలు చేసేందుకు అధికారులు సిద్దమయ్యారు. జీహెచ్ఎంసీ పరిధిలోని పాత ప్రాంతాల్లో రెంటల్ ఆధారిత ప్రాపర్టీ ట్యాక్స్ విధానాన్ని అమలు చేస్తుండగా, విలీన పట్టణ స్థానిక సంస్థల పరిధిలో రిజిస్ట్రేషన్ మార్కెట్ వ్యాల్యుయేషన్ ప్రకారం ప్రాపర్టీ ట్యాక్స్ ను అమలు చేస్తున్నారు. దీంతో మూడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని పాత పరిధుల్లో ఒక విధానం, విలీన పట్టణ స్థానిక సంస్థల్లో మరో విధానం అమలవుతుంది. ఈ రెండు విధానాల్లో ఏదో ఒక్క విధానాన్ని యూనిఫామ్ గా అమలు చేసే దిశగా త్వరలోనే సర్కారు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. మూడు కార్పొరేషన్ల పరిధిలో మొత్తం 28 లక్షల 80 వేల పై చిలుకు పన్ను చెల్లించే ప్రాపర్టీ ట్యాక్స్ ఇండెక్స్ నెంబర్లు (పీటీఐఎన్)లున్నాయి. వీటిలో కొన్నింటి నుంచి రెంటల్ ఆధారిత ప్రాపర్టీ ట్యాక్స్ విధానం, మరి కొన్నింటిలో మార్కెట్ వ్యాల్యుయేషన్ విధానాలు అమలవుతున్నాయన్న విషయాన్ని జీహెచ్ఎంసీ అధికారులు సర్కారు దృష్టికి తీసుకెళ్లగా, వర్తమాన ఆర్థిక సంవత్సరం (2025-26) చివరి కల్లా ఇదే విధానాన్ని కొనసాగించాలని సర్కారు ఆదేశించినట్లు తెలిసింది. కానీ నూతన సంవత్సరం నుంచి యూనిఫామ్ గా ఒకే ట్యాక్స్ విధానాన్ని అమలు చేసేలా ఆదేశాలు జారీ చేయనున్న సర్కారు ఏ విధానాన్ని ఎంపిక చేసుకుంటుందో? సర్కారు నిర్ణయంతో ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో? వేచి చూడాలి.
Also Read: Collector Rizwan Basha: గ్యాస్ వినియోగదారులు ఈ నిబంధనలు తప్పక పాటించాలి : కలెక్టర్ రిజ్వాన్ బాషా