Ed it Raids : తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఆదాయపన్నుశాఖ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాడులు చేపట్టారు. హైదరాబాద్, కరీంనగర్లో ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నారు. మంత్రి గంగుల కమలాకర్ టార్గెట్ గా ఈ సోదాలు జరుగుతున్నారు. మంత్రి గంగుల ఇళ్లు , కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. కరీంనగర్లోని ఇంటితోపాటు మంకమ్మతోటలో ఆయనకు చెందిన శ్వేత గ్రానైట్, కమాన్ ప్రాంతంలోని మహవీర్, ఎస్వీఆర్ గ్రానైట్స్లో ఐటీ, ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
అదేసమయంలో గ్రానైట్ వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ, ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్ పంజాగుట్టలోని పీఎస్ఆర్ గ్రానైట్స్, హైదర్గూడలోని జనప్రియ అపార్ట్మెంట్ లో తనిఖీలు నిర్వహించారు. సోమాజీగూడలో గ్రానైట్ వ్యాపారి శ్రీధర్ నివాసంలోనూ సోదాలు చేపట్టారు. కరీంనగర్ లో గ్రానైట్ వ్యాపారి అరవింద్వ్యాస్, మరికొంతమంది వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాల్లోనూ తనిఖీలు జరుగుతున్నాయి.
గ్రానైట్ వ్యాపారులు ఫెమా నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో ఐటీ, ఈడీ అధికారులు సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది. గతంలోనే 8 ఏజెన్సీలకు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో 20 మంది అధికారులు బృందాలుగా విడిపోయి తనిఖీలు చేస్తున్నారు. గ్రానైట్ పరిశ్రమలకు చెందిన పత్రాలను పరిశీలిస్తున్నారు.