Edupayala Temple: మంజీరా “ఏడు” పాయలుగా చీలి ప్రవహించే ప్రసిద్ధమైన ప్రాంతం.. మంజీరాలో పుణ్యస్నానమాచరిస్తే సకల పాపాలు తొలగుననే భక్తుల నమ్మకం.. ఇవన్నీ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గాదేవి క్షేత్రం సొంతం. మహాశివరాత్రికి ఇక్కడ మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా జాతర నిర్వహిస్తారు. ఇట్టి జాతర వేడుకలకు ఆలయం ముస్తాబయింది. ఏడు పాయల్లో ఒకటైన నదీపాయ ఒడ్డున స్వయంభుగా వెలసిన అమ్మవారిని లక్షలాదిమంది భక్తులు వీక్షించి తరించేందుకు సిద్ధమయ్యారు. ఆదివారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వనదుర్గామాతకు పట్టు వస్త్రాల సమర్పణతో సంబురం ప్రారంభం కానుంది. ఆదివారం నుంచి మంగళవారం వరకు కనుల పండుగగా నిర్వహించే మహా జాతర నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యాయి.
10 నుంచి 15 లక్షల మంది భక్తులు
తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగున ఉన్న మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వనజాతరకు తరలివస్తారు. సుమారు 10 నుంచి 15 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉంది. సొంత వాహనాలు, ఆర్టీసీ బస్సులు, ఎడ్లబండ్లు, కాలినడకన ఎలా కుదిరితే అలా అమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవాలని ప్రజలు ఏడుపాయలకు తరలి వస్తుంటారు. గతంలో ఆలయంలో ఉత్సవాలు మాత్రమే నిర్వహించగా నేడు నిత్య దర్శనాలతో ఏడుపాయల క్షేత్రం కళకళలాడుతోంది. ప్రతి ఏటా మహాశివరాత్రి పర్వదినాన మూడు రోజులపాటు నిర్వహించే మహా జాతరక ఊళ్లకు ఊర్లే తరలివస్తాయి.
ఏ రోజున ఏ సంబురమంటే..
మహాశివరాత్రి పర్వదినాన వేకువ జామున 4 గంటలకు రాతి గుహలో కొలువుదీరిన వనదుర్గామాతకు పంచామృతాభిషేకం, అలంకారం, సహస్రనామ కుంకుమార్చనతో అంగరంగ వైభవంగా మహా జాతర ప్రారంభమవుతుంది. జాతరలో ప్రధాన ఘట్టమైన కార్యక్రమం రెండవ రోజు సోమవారం ఎడ్ల బండ్ల ప్రదర్శన ఉంటుంది. చివరి రోజు మంగళవారం రథోత్సవంతో మహాజాతర ముగుస్తుంది.
Also Read: Gongura Pulihora Recipe: మొదటిసారి చేసేవారు కూడా అదిరిపోయేలా చేసే గోంగూర పులిహోర రెసిపీ!
400 ప్రత్యేక బస్సులు, 10 ఉచిత బస్సులు
మహా జాతరకు ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు పొరుగు జిల్లాలు, ప్రధానంగా హైదరాబాద్, సికింద్రాబాద్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఆయా ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ అధికారులు 400 స్పెషల్ బస్సులను నడుపుతున్నారు. టేకుల గడ్డ నుంచి ఆలయం వరకు 10 మినీ బస్సులను ఉచితంగా నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. టేకుల గడ్డ నాగసానిపల్లి నర్సాపూర్ బాల్నగర్ మెదక్ తదితర ప్రాంతాల్లో బస్సు పాయింట్లు ఏర్పాటు చేశామని తెలిపారు. 24 గంటలు బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. మంగళవారం రాత్రి వరకు ఈ బస్సులు నడపనున్నట్లు వారు వెల్లడించారు.
250 మంది వైద్య సిబ్బంది
అనారోగ్యానికి గురయ్యే భక్తులకు సేవలందించడానికి వైద్య ఆరోగ్యశాఖ సిద్ధమైంది. ఐదు ప్రథమ చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేసింది. జిల్లా వైద్యాధికారి శ్రీరామ్ తో పాటు 250 మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. తీవ్ర అస్వస్థతకు గురైన వారిని ఆసుపత్రికి తరలించడానికి మూడు 108 అంబులెన్స్ అందుబాటులో ఉంచనున్నారు. అలాగే 102 వాహనాలు రెండు, 104 ఒకటి అందుబాటులో ఉండనున్నాయి.
భక్తులకు నిఘా నేత్రాల వెన్నుదన్ను..
వన దుర్గమ్మ దర్శనానికి వచ్చిన వారు సాఫీగా తిరిగి వెళ్ళడంలో పోలీసులదే కీలక పాత్ర. ఈ మేరకు ఆలయం ఆధ్వర్యంలో వారు పక్కా ఏర్పాట్లు చేశారు. ఎక్కడ ఏం జరిగినా తెలిసేలా జాతర చుట్టూ నిఘా నేత్రాలు ఏర్పాటు చేశారు. ఇవి 24 గంటలు ఏడుపాయలపై కన్నేసి ఉంచుతాయి. వాటి నిర్వహణకు ప్రత్యేక సిబ్బందిని నియమించారు. మద్యం అమ్మకాలను నిరోధించేందుకు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో చెక్ పోస్టులు, సంచార బృందాలు ఏర్పాటు చేశారు. జాతరలో కీలక పాత్ర పోషించనున్న పోలీసులు శనివారం సాయంత్రానికి ఏడుపాయల వనదుర్గామాత చెంతకు చేరుకున్నారు. సుమారు ఎనిమిది వందల పైచిలుకు పోలీసు సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. డీఎస్పీలు,సీఐలు, ఎస్ఐ, ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్స్, కానిస్టేబుల్స్, హోంగార్డ్స్, మహిళా సిబ్బంది విధుల్లో పాల్గొననున్నారు.
Also Read: Vijay Varma: తమన్నాను వదిలేశాక తిరిగి ప్రేమలో పడిన బాలీవుడ్ నటుడు?