Kavitha Kejriwal custody news(Political news telugu): బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి చుక్కెదురైంది. జ్యుడీషియల్ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో అరెస్టై తీహార్ జైలులో ఉన్న కవిత జ్యుడీషియల్ కస్టడీని కోర్టు పొడిగించింది. మరో 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీని పొడిగించింది. దీంతో మే 7 వరకు ఆమె తీహార్ జైలులోనే ఉండనున్నారు.
అదేవిధంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని కూడా కోర్టు మే 7 వరకు పొడిగించింది. దీంతో కేజ్రీవాల్ కూడా మే 7 వరకు తీహార్ జైలులోనే ఉండనున్నారు. కవిత జ్యుడీషియల్ కస్టడీ నేటితో ముగియగా ఆమెను ఈడీ, సీబీఐ వర్చువల్ గా కోర్టులో హాజరుపరిచారు. కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగించాలని ఈ సందర్భంగా ఈడీ, సీబీఐ కోర్టును కోరాయి.
అయితే, కవితకు జ్యుడీషియల్ కస్టడీ అవసరం లేదంటూ ఆమె తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. సాక్షాలను తారుమారు చేసే అవకాశాలు ఉన్నాయని, కేసు విచారణ పురోగతి విషయంలో ప్రభావం చూపే అవకాశముందని.. ఆమె అరెస్ట్ చట్టబద్ధంగా జరిగిందని, ఈ నేపథ్యంలో కస్టడీని పొడిగించాలని ఈడీ కోరింది. సాక్షాలను తారుమారు చేస్తారని కవితను అరెస్ట్ చేసినప్పటి నుంచి ఈడీ ఆరోపిస్తుంది.. కానీ, కొత్తగా ఏం చెప్పడం లేదంటూ కవిత తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
Also Read: కవితకు కలిసిరాని కొత్త సంవత్సరం.. పొలిటికల్ కేసంటూ వ్యాఖ్యలు!
వాదనల అనంతరం కేసు పురోగతికి సంబంధించిన వివరాలను ఈడీ.. కోర్టుకు అందించింది. అదేవిధంగా 60 రోజుల్లో కవిత అరెస్ట్ పై చార్జిషీట్ సమర్పిస్తామని ఈడీ.. కోర్టుకు తెలిపింది. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం కవిత జ్యుడీషియల్ కస్టడీని మరో 14 రోజులపాటు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో కవిత మే 7 వరకు తీహార్ జైలులో ఉండనున్నారు. కాగా, ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో మార్చి 15న కవిత అరెస్ట్ అయిన విషయం విధితమే.
అయితే, ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో తనను ఈడీ అక్రమంగా అరెస్ట్ చేసిందని, తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.