Fake Notes: నాగర్కర్నూల్ జిల్లాలో ఒక్కసారిగా నకిలీ రూ.500 నోట్ల వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. స్థానిక వ్యాపారులు, సామాన్య ప్రజలు ఏ నోటు అసలో, ఏది నకిలీయో తెలియక ఆందోళన చెందుతున్నారు.
వెలుగులోకి వచ్చిందిలా..
బిజినపల్లిలోని ఒక ప్రభుత్వ బ్యాంకులో వైన్స్ యజమాని డీడీ కట్టడానికి వెళ్లిన సమయంలో ఈ దందా బయటపడింది. యజమాని ఇచ్చిన నగదును పరిశీలించిన బ్యాంకు సిబ్బంది, అందులో రెండు రూ.500 నకిలీ నోట్లు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అధికారులకు సమాచారం అందించడంతో పోలీసులు రంగంలోకి దిగారు.
రూ.20 వేలకు లక్ష నకిలీ నోట్లు!
మద్యం దుకాణాలు, పెట్రోల్ బంకులు, బేకరీలు, బిజీగా ఉండే వ్యాపార సముదాయాలనే టార్గెట్ చేసుకుని ఈ ముఠా నకిలీ నోట్లను చెలామణి చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. రూ.20 వేల అసలు నగదు ఇస్తే.. రూ.1 లక్ష నకిలీ నోట్లను ఇచ్చేలా ఒక ముఠా ఒప్పందాలు చేసుకుని సరఫరా చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు.
పోలీసుల విచారణ.. ఏపీకి బృందాలు!
ఈ వ్యవహారంలో బిజినపల్లి మండలం మంగనూర్కు చెందిన ఇద్దరు యువకులను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆంధ్రాలోని భీమవరం నుంచే ఈ నకిలీ నోట్లు జిల్లాలోకి సరఫరా అవుతున్నాయని ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో ఒక ప్రత్యేక పోలీస్ బృందం భీమవరం బయలుదేరి వెళ్లింది.
నోట్ల మూలాలను పసిగట్టేందుకు పోలీసులు ముమ్మరం దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి విచారణ తర్వాత ఈ రాకెట్ వెనుక ఉన్న సూత్రధారుల వివరాలను వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. ప్రజలు, వ్యాపారులు నగదు లావాదేవీలు జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
Also Read: నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!