Fake Pattas: జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో భూ ఆక్రమణదారుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ప్రభుత్వ, వివాదాస్పద స్థలాలను లక్ష్యంగా చేసుకుని కొందరు అక్రమార్కులు నకిలీ పట్టాలు సృష్టిస్తూ దర్జాగా కబ్జాలకు తెరలేపుతున్నారు. గద్వాల పట్టణ పరిధిలోని సర్వే నెంబర్ 458 లోని విలువైన భూమిపై భూబకాసురుల కన్ను పడింది.
సర్వే నెంబర్ 458 లో ఉన్న ఖాళీ స్థలాలను ఆక్రమించేందుకు కొందరు వ్యక్తులు పథకం ప్రకారం నకిలీ పట్టాలు, రికార్డులను సృష్టించారు. తమకు ఆ స్థలంపై హక్కులు ఉన్నాయంటూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తూ, అమాయక ప్రజలకు వాటిని అంటగట్టేందుకు లేదా నేరుగా స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
Also read: ట్రెండింగ్లో బెస్ట్ స్లిమ్ పవర్ బ్యాంక్.. అసలు ధర తెలిస్తే షాక్ అవుతారు!
ఈ నకిలీ పట్టాల వ్యవహారంపై స్థానికులు, బాధితులు తహసీల్దార్ (ఎమ్మార్వో) కార్యాలయంలో ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. రెవెన్యూ రికార్డుల ప్రకారం సర్వే నెంబర్ 458 పరిధిలో ఎలాంటి పట్టాలు జారీ చేయలేదని రెవెన్యూ అధికారులు స్పష్టం చేశారు. కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు సర్కారు ముద్రలు, ఫోర్జరీ సంతకాలతో తయారు చేసిన పత్రాలను చలామణీలోకి తెస్తున్నారని తేలింది.
సర్వే నెంబర్ 458 పరిధిలో అక్రమ నిర్మాణాలను, కబ్జా యత్నాలను వెంటనే అడ్డుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ఫోర్జరీ సంతకాలు, నకిలీ సీళ్లతో ప్రభుత్వ వ్యవస్థను తప్పుదోవ పట్టిస్తున్న ముఠాపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నకిలీ పట్టాల వ్యవహారంలో రెవెన్యూ శాఖకు చెందిన సిబ్బంది ఎవరివైనా సహకారం ఉందా అనే కోణంలోనూ సమగ్ర విచారణ జరపాలని స్థానికులు కోరుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి సర్వే నెం. 458 భూములను కాపాడటంతో పాటు, ప్రజలు ఎవరూ ఈ నకిలీ పట్టాలను నమ్మి కొనుగోలు చేసి మోసపోకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ప్రజా సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.
Also read: ఈనెల 14 నుండి 25 వరకు తెలంగాణలో హై అలర్ట్!