Ganesh Festival: రాష్ట్రవ్యాప్తంగా వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో ముగిసేలా చూడటానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని డీజీపీ సీ.వీ.ఆనంద్ అధికారులను ఆదేశించారు. ఈనెల 14 నుంచి ప్రారంభం కానున్న గణేష్ ఉత్సవాలు 25న నిమజ్జనంతో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం డీజీపీ కార్యాలయం నుండి రాష్ట్రంలోని ఎస్ఐలు, ఉన్నతాధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు.
ప్రతి గణేష్ మండపం వివరాలను ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్ లో నమోదయ్యే చూడాలని డీజీపీ సూచించారు. మండపం లొకేషన్, నిర్వాహకుల వివరాలు, నిమజ్జనానికి ఉపయోగించే వాహనాల వివరాలను ఇందులో అప్డేట్ చేయ్యాలన్నారు. బాంబ్ డిస్పోజల్ టీమ్స్, డాగ్ స్క్వాడ్స్ తనిఖీల వివరాలను టీజీ కాప్ యాప్ లో అప్ లోడ్ చెయ్యాలని చెప్పారు.
మండపాల వద్ద విద్యుత్ ప్రమాదాలు జరగకుండా విద్యుత్, అగ్నిమాపక శాఖలతో సమన్వయం చేసుకోవాలని డీజీపీ సూచించారు. నిర్వాహకులు కచ్చితంగా సీసీ కెమెరాలు, క్యూ లైన్లు ఏర్పాటు చేసుకునేలా చూడాలన్నారు.
Also read: పార్టీ లవర్స్కు నెక్స్ట్ లెవెల్ ట్రీట్..చూడటానికి క్లాస్, సౌండ్లో మాస్
ఈనెల 25న జరిగే నిమజ్జన రూట్లు, రోడ్లు, వంతెనల సామర్థ్యాన్ని ముందే పరిశీలించి, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని ఆదేశించారు.
శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా సోషల్ మీడియాలో వచ్చే పుకార్లపై నిరంతరం నిఘా ఉంచాలన్నారు. వివాదాస్పద పోస్టులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కమిషనర్లు, డీసీపీలు, ఎస్పీలు మండపాలను సందర్శించి పరిస్థితిని సమీక్షించాలన్నారు. పరిశీలనలో తెలిసిన విషయాలను పాయింట్ బుక్స్ లో నమోదు చెయ్యాలని చెప్పారు. సమీక్షా సమావేశంలో డీజీ (టెక్నికల్ సర్వీసెస్) శ్రీనివాసరావు, ఐజీ (ఇంటెలిజెన్స్) కార్తికేయ, ఐజీ మల్టిజోన్-1 చంద్రశేఖర్రెడ్డి, టీస్పార్క్ ఎస్పీ రూపేష్, ఏఐజీ రమణకుమార్, హైదరాబాద్ డీసీపీ అవినాష్ కుమార్, డీసీపీ విక్రాంత్ కుమార్ సింగ్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Also read: దద్దరిల్లిన హన్మకొండ.. వేలాది మంది విద్యార్థులతో కవిత భారీ పాదయాత్ర!