Bowrampet Car: బౌరంపేటలో సోమవారం ఉదయం దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓపెన్ ల్యాండ్లో నిలిపి ఉన్న కారు ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా.. కారులో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది.పోలీసుల వివరాల ప్రకారం.. బౌరంపేటలోని రుద్ర కన్స్ట్రక్షన్స్ సమీపంలోని ఓపెన్ ల్యాండ్లో సోమవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో కారు మంటల్లో కాలిపోతుండటాన్ని స్థానికులు గుర్తించారు.
వెంటనే దుండిగల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకునేలోపే కారు పూర్తిగా దగ్ధమైంది. కారులో ఉన్న వ్యక్తి కూడా మంటల్లో మృతి చెందినట్లు గుర్తించారు. మృతుడిని బౌరంపేటలోని ప్రణీత్ ప్రణవ్ విండోస్కు చెందిన కార్తీక్ (40), రాధాకృష్ణ కుమారుడుగా పోలీసులు గుర్తించారు. కార్తీక్ లాండ్రీ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Also read: స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!
కార్తీక్ గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు, మరోవైపు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పోలీసులు తెలిపారు. గత రెండున్నరేళ్లుగా భార్యకు దూరంగా ఉంటున్న నేపథ్యంలో మనస్తాపానికి గురై.. కారుతో సహా నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. అయితే ఘటనకు సంబంధించి ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారణ చేపట్టినట్లు దుండిగల్ పోలీసులు తెలిపారు.
Also read: అసెంబ్లీలో మంత్రి సీతక్క భావోద్వేగ ప్రసంగం.. కన్నీళ్లు పెట్టుకున్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కమార్!