Fatima College: ఫాతిమా కాలేజీ వ్యవహారంపై హైడ్రా (HYDRAA) కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ అంశం ప్రస్తుతం హైకోర్టు పరిధిలో ఉందని, కోర్టు ఆదేశాల ప్రకారమే తాము తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఈ వివాదానికి సంబంధించి పూర్తి వివరాలను పరిశీలిస్తే, ప్రధానంగా కాలేజీ నిర్మాణం జరిగిన స్థలంపై స్పష్టత రావాల్సి ఉంది.
ప్రస్తుతం హైకోర్టు ఈ బాధ్యతను నీటిపారుదల (Irrigation), రెవెన్యూ విభాగాలకు అప్పగించింది. ఈ రెండు శాఖల సమన్వయంతో క్షేత్రస్థాయిలో సమగ్ర సర్వే నిర్వహించనున్నారు. ఈ సర్వేలో ప్రధానంగా తేలాల్సింది ఏమిటంటే.. సదరు నిర్మాణాలు ఎఫ్.టి.ఎల్ (Full Tank Level) పరిధిలోకి వస్తాయా లేదా అనేది. దీనితో పాటు, కాలేజీ యాజమాన్యం ఎన్ని అనుమతులు తీసుకుంది, ఆ అనుమతులు నిబంధనల ప్రకారం ఉన్నాయా అనే విషయాలను కూడా అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు.
సర్వే పూర్తయిన తర్వాత ఆ నివేదికను హైకోర్టుకు సమర్పిస్తారు. కోర్టు ఆ నివేదికను పరిశీలించి, తదుపరి చర్యల కోసం హెచ్.ఎమ్.డి.ఏ (HMDA) కు బదిలీ చేసే అవకాశం ఉంది. ఈ మొత్తం ప్రక్రియలో హైకోర్టు ఇచ్చే తీర్పు, రెవెన్యూ , ఇరిగేషన్ శాఖలు ఇచ్చే సర్వే రిపోర్టులే అత్యంత కీలకం. కమిషనర్ రంగనాథ్ చెబుతున్న దాని ప్రకారం, ఈ నివేదికలు అందిన తర్వాతే చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై హైడ్రా తుది నిర్ణయం తీసుకుంటుంది. ప్రస్తుతానికి సర్వే నివేదిక కోసం అందరూ వేచి చూస్తున్నారు.
Also Read: టీ-వ్యాలెట్పై ‘ప్రైవేట్’ పంజా.. 16 లక్షల మంది యూజర్ల డేటా సేఫ్నా?