Telangana: ఇంటర్నెట్ అంటేనే తెలియని గ్రామం అది. కానీ.. ఇప్పుడు టెరా బైట్ల డేటాని అలవోకగా వాడేస్తూ వార్తల్లోకి ఎక్కింది. మీదాకా వచ్చింది. డిజిటల్ తెలంగాణే లక్ష్యంగా.. ఈ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందుకే.. ఇప్పుడు అడవి శ్రీరాంపూర్ పేరు రీసౌండ్లో వినిపిస్తోంది. అదొక్కటే కాదు.. ఇక్కడి ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఏఐ ల్యాబ్.. టాక్ ఆఫ్ ది స్టేట్గా మారింది. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు ఆశ్చర్యపోయేలా.. అడవి శ్రీరాంపూర్లోని గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ దూసుకుపోతున్నారు. అడవి శ్రీరాంపూర్.. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ శ్రీరాంపూర్గా మారిపోయింది.
తొలి ఏఐ ల్యాబ్ ఏర్పాటు చేసిన రేవంత్ సర్కార్
అడవి శ్రీరాంపూర్ పేరులోనే కాదు.. ఊరు చుట్టూ కూడా అడవి లాంటి పరిసరాలే ఉంటాయ్. మంథని నియోజకవర్గంలో మారుమూల గ్రామం ఇది. ఇప్పుడు ఈ విలేజ్.. పట్టణాలను, నగరాలను మించిన టెక్నాలజీ రెవల్యూషన్కి కేరాఫ్గా మారింది. గ్రామీణ భారతంలో డిజిటల్ విప్లవాన్ని తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే.. పెద్దపెల్లి జిల్లా ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్లోని ఈ ప్రభుత్వ హైస్కూల్లో తొలి ఏఐ ల్యాబ్ని.. పయోనీర్ ల్యాబ్ సహకారంతో ఏర్పాటు చేసింది.
టీ-ఫైబర్ సహకారంతో ప్రభుత్వ స్కూళ్లలో ఏఐ పాఠాలు
అడవి శ్రీరాంపూర్.. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు దత్తత తీసుకున్న గ్రామం. ఇప్పుడిది.. ఏఐ శ్రీరాంపూర్గా వార్తల్లో నిలిచింది. ఈ స్కూల్లోనే.. ప్రభుత్వ పాఠశాలల్లో.. ఏఐ టెక్నాలజీ రెవల్యూషన్కు ఇది తొలి మెట్టు. ఇండియాలోనే ఎక్కడా లేని విధంగా.. ఓ ప్రభుత్వ పాఠశాలలో ఏఐ ల్యాబ్ని ఏర్పాటు చేసింది టీఫైబర్ సంస్థ. దీనికోసం.. ఐటీ మంత్రి శ్రీధర్ బాబు తో పాటు టీ-ఫైబర్ టీమ్ 12 రోజుల పాటు రాత్రి, పగలు అనే తేడా లేకుండా పనిచేసింది. మొత్తానికి.. టీ-ఫైబర్ ఎండీ వేణు ప్రసాద్, కలెక్టర్ కోయ శ్రీహర్ష, డీఈవో మాధవితో కలిసి.. జడ్పీ స్కూల్లో ఏర్పాటు చేసిన ఏఐ ల్యాబ్తో పాటు ఇంటర్నెట్ విలేజ్ సర్వైలైన్స్ని ప్రారంభించారు మంత్రి శ్రీధర్బాబు.
రాష్ట్రంలో మరిన్ని గ్రామాలకు అందనున్న ఇంటర్నెట్ సేవలు
మారుమూల అటవీ గ్రామమైన అడవి శ్రీరాంపూర్ని.. ఇంటర్నెట్ విలేజ్గా మార్చామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఈ గ్రామాన్ని.. ఏఐ విలేజ్గా మార్చేందుకు కోటి 20 లక్షలు ఖర్చు చేసినట్లు తెలిపారు. భవిష్యత్తులో.. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు.. ప్రభుత్వ పాఠశాలల్ని చూసి అసూయ పడేలా చేస్తామన్నారు శ్రీధర్ బాబు. రాష్ట్రంలో.. పైలట్ ప్రాజెక్ట్ కింద ఫైబట్ ఆప్టిక్తో ఇంటర్నెట్ విలేజ్గా మార్చేందుకు కొన్ని గ్రామాలను ఎంపిక చేశారు. ఇందులో.. మంత్రి శ్రీధర్బాబు నియోజకవర్గంలోని అడవి శ్రీరాంపూర్తో పాటు మరో రెండు సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలోనూ, మరొకటి ఆరోగ్యమంత్రి దామోదర రాజనర్సింహ నియోజకవర్గంలో ఉన్నాయి. అయితే.. తెలంగాణలో మొట్టమొదటి ఏఐ ల్యాబ్కు.. అడవి శ్రీరాంపూర్ జడ్పీ హైస్కూల్ కేరాఫ్గా మారింది.
ప్రభుత్వ పాఠశాలల్లో.. గూగుల్ సేవల్ని వినియోగించుకునేందుకు గూగుల్ సంస్థతోనూ.. టీ-ఫైబర్ సంస్థ ఒప్పందం చేసుకుంది. విద్యార్థులకు అర్థమయ్యేరీతిలో పాఠాలు చెప్పేందుకు.. ఏఐ టూల్స్ని కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా.. కోడింగ్ బుక్స్ని కూడా అందుబాటులో ఉంచారు. దీనికి సంబంధించి..
నిజానికి అడవి శ్రీరాంపూర్లో ఆరు నెలల నుంచి ఉచిత ఇంటర్నెట్ సేవలు అందుతున్నాయి. ఇంటర్నెట్ కనెక్టివిటీతో ఊళ్లోని టీవీలన్నీ.. స్మార్ట్ టీవీలుగా మారిపోయాయ్. వై-ఫై కనెక్టివిటీతో.. ప్రతి ఒక్కరూ తమ మొబైల్లోనే అన్నీ వీక్షిస్తున్నారు. అయితే.. నామమాత్రపు రుసుముతో గ్రామగ్రామాన ఫైబర్ కేబుల్తో ఇంటర్నెట్ అందుబాటులోకి తెచ్చి.. రాష్ట్రాన్ని డిజిటల్ తెలంగాణగా మార్చాలన్నాది తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం. ఈ క్రమంలో.. తొలిదశలో నారాయణపేట, సంగారెడ్డి, పెద్దపల్లి జిల్లాల్లో 2096 గ్రామపంచాయతీలకు టీ-ఫైబర్ ఆప్టిక్ని లింక్ చేశారు. ఇందుకోసం.. భారత్ నెట్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం.. తెలంగాణకు 2500 కోట్లు అందించింది. అందులో భాగంగానే.. 20ఎంబీపీఎస్ స్పీడ్తో అడవి శ్రీరాంపూర్ గ్రామంలో ఇంటర్నెట్ సేవలు అందుతున్నాయి.
Also Read: చంద్రగ్రహణం రోజు అఘోరాల పూజలు.. విరుగుడుగా శాంతి పూజలు
ఇంటర్నెట్ విప్లవంతో.. అడవి శ్రీరాంపూర్లో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటయ్యాయి. నిఘా కోసం 20 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వాటన్నింటిని.. గ్రామపంచాయతీకి లింక్ చేయడంతో పాటు ముత్తారం పోలీస్ స్టేషన్కు, హైదరాబాద్లోని టీ-ఫైబర్ ఆఫీసుకు కూడా అనుసంధానం చేశారు. సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల.. ఈ గ్రామంలో క్రైమ్ రేట్ తగ్గేందుకు ఆస్కారముందనే చర్చ జరుగుతోంది. తెలంగాణలో ఇప్పటికే 94 మండలాల్లో.. టీ-ఫైబర్ సేవలు అందించేందుకు రంగం సిద్ధమైంది. ఈ ప్రాజెక్టుతో.. అనేక ప్రభుత్వ సంస్థలను కనెక్ట్ చేసేందుకు నడుం బిగించారు. డిజిటల్ తెలంగాణ మిషన్లో.. అడవి శ్రీరాంపూర్ ఇప్పుడు ముందు వరుసలో నిలవడంతో.. గ్రామస్తులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.