Hyderabad News: పశు వైద్య రంగంలో అరుదైన శస్త్రచికిత్స విజయవంతమైంది. ఈ ఘనతకు హైదరాబాద్ నగరం వేదికైంది. ఇన్ఫెక్షన్ వల్ల చర్మం కోల్పోయి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ కుక్కకు పెట్స్ కేర్ ఆసుపత్రి వైద్యులు చేప చర్మంతో అంటుకట్టి దానికి పునర్జన్మ ప్రసాదించారు. ఇంతకీ ఎక్కడ, ఏంటి?
హైదరాబాద్ పశువైద్యుల ఘనత
హైదరాబాద్ నుంచి బోడుప్పల్కు చెందిన రాఘువ అనే వ్యక్తి తన పెంపుడు కుక్క చర్మ వ్యాధి బారిన పడింది. అక్టోబర్లో కుక్కకు కాలిన గాయాలు అయ్యాయి. అప్పటికే దాని శరీరం దాదాపుగా 50 శాతం చర్మం డ్యామేజ్ అయ్యింది. చివరకు శునకం పరిస్థితి విషమంగా మారింది.
ఓ వ్యక్తి ఇచ్చిన సలహా మేరకు జూబ్లీహిల్స్లోని పెట్స్ కేర్ ఆసుపత్రిని ఆశ్రయించాడు సదరు వ్యక్తి. సాధారణ పద్ధతుల్లో చికిత్స చేయడం కష్టమని భావించారు పశువైద్యులు. అందుకోసం అత్యాధునిక రీజెనరేటివ్ పద్దతిని ఉపయోగించారు. ప్రాసెస్ చేసిన చేప చర్మాన్ని.. శునకానికి ఇన్ఫెక్షన్ సోకిన భాగంలో గ్రాఫ్టింగ్ చేయడం అన్నమాట.
చేప చర్మంతో కుక్కకు సర్జరీ
ప్రాసెస్ చేసిన చేప చర్మాన్ని కుక్క గాయపడిన ప్రాంతంలో అంటుకట్టే పద్దతితో సర్జరీ చేసి అమర్చారు వైద్యులు. చేప శరీరం.. ఇన్ఫెక్షన్ తగ్గించి శునకం నొప్పిని నివారించింది. దీనివల్ల కణజాల పునరుత్పత్తికి దోహదపడింది. దీనికితోడు కొల్లాజెన్, ఒమేగా కొవ్వు ఆమ్లాలు బయో యాక్టివ్ సమ్మేళనాలతో ఉన్న చేప చర్మం తాత్కాలిక చర్మ ప్రత్యామ్నాయంగా ఉపయోగించారు.
ప్రస్తుతం శునకం పూర్తి ఆరోగ్యంగా ఉందని, చర్మం సాదారణంగా ఉందని వైద్యులు వెల్లడించారు. దీనిపై డాక్టర్ వెంకట్ మాట్లాడారు. తెలంగాణలో ఈ తరహా ఆపరేషన్ చేయడం ఇదే తొలిసారని తెలిపారు. చర్మ మార్పిడి చేప చర్మంతో చేస్తే ఎంతో ప్రభావవంతంగా ఉంటుందన్నారు.
ALSO READ: సంక్రాంతి నేపథ్యంలో సొంతూళ్లకు ప్రజలు.. కిక్కిరిసిన రైల్వే, బస్ స్టాండ్లు
గాయాలు త్వరగా మానడానికి చేప చర్మం అవసరమైన పోషకాలను అందిస్తాయని తెలిపారు. దీనివల్ల జంతువులకు నొప్పి తగ్గడమేకాదు, కవచంలా పని చేస్తుందన్నారు. బ్యాక్టీరియా లోపలికి వెళ్లకుండా అడ్డుకోవడం ద్వారా ఇన్ఫెక్షన్ వ్యాప్తించకుండా అరికడుతుందన్నారు.
కాలిన గాయాలు లేకుంటే చర్మ వ్యాధులున్న మనుషులపై ఇలాంటి ప్రయోగాలు జరుగుతుంటాయని అంటున్నారు కొందరు వైద్యులు. పశు వైద్యంలో ఇదొక విప్లవాత్మక మార్పుగా చెబుతున్నారు. భవిష్యత్తులో మూగజీవాలకు ఎదురయ్యే క్లిష్టమైన చర్మ సమస్యలకు తక్కువ ఖర్చుతో మంచి ఫలితాలను ఇవ్వవచ్చని వైద్య నిపుణుల మాట.