Food Adulteration: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలో కల్తీ ఫుడ్ సమస్య చాలా తీవ్రంగా విస్తరించిందని, కల్తీ దందాకు కేరాఫ్ అడ్రస్ గా పాతబస్తీ మారిందని ఎమ్మెల్సీ అంజిరెడ్డి తెలిపారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం హైదరాబాద్.. దేశంలోనే కల్తీ ఆహారం విషయంలో మొదటి స్థానంలో ఉందన్నారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మట్లాడారు.
ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం
ఫ్యూచర్ సిటీ సంగతేమో కానీ.. కల్తీ సిటీగా మారే ప్రమాదం ఉందన్నారు. కల్తీ విషయం లో హైదరాబాద్ బ్రాండ్ ప్రతిష్ట దెబ్బతింటోందని, ప్రజలు డయాబెటిస్ బారిన పడుతున్నారన్నారు. ఫ్యాటీ లివర్, కిడ్నీ ఫెయిల్యర్, బీపీ వంటి సమస్యలు పెరుగుతున్నాయన్నారు. రాష్ట్రం అనారోగ్య తెలంగాణగా తయారవుతోందన్నారు. రాష్ట్రంలో ఫుడ్ ఇన్స్పెక్టర్లు లేరని, సరిపడా ఫుడ్ సేఫ్టీ టెస్టింగ్ ల్యాబొరేటరీలు లేవని పేర్కొన్నారు.
ఫుడ్ ఇన్స్పెక్టర్ల కొరత
కల్తీ ఫుడ్ ని కంట్రోల్ చేయడానికి పూర్తిస్థాయి కఠినమైన చట్టాలు అమలు కావడం లేదన్నారు. ఈ విషయాన్ని చాలా చిన్న పిటీ కేసుల, కేవలం రూ.10 వేల జరిమానా వేసి, చేతులు దులుపు కుంటున్నారని అంజిరెడ్డి తెలిపారు. కల్తీ ఆహారాన్ని ఆర్గనైజ్డ్ క్రైమ్ గా పరిగణించాలని, కనీసం ఏడేళ్లు జైలు శిక్ష విధించేలా చట్టం ఉండాలని కోరారు. 2017లో ఎఫ్ఎస్ఎస్ఏఐ రాష్ట్రానికి సుమారు 200 మంది ఫుడ్ ఇన్స్పెక్టర్లను నియమించుకోవాలని సూచించిందని, కానీ ప్రస్తుతానికి కేవలం 20 మంది ఫుడ్ ఇన్స్పెక్టర్లు మాత్రమే ఉన్నారని ఆయన తెలిపారు.
ఫుడ్ సేఫ్టీ ల్యాబ్స్ లో లోపాలు
వెంటనే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ల రిక్రూట్మెంట్ ప్రక్రియను ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. పొరుగు రాష్ట్రం తమిళనాడులో సుమారు 500 మంది ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారని, కానీ తెలంగాణలో 100 మంది ఫుడ్ ఇన్స్పెక్టర్లు కూడా సరిపడా లేరన్నారు. 2024 నవంబర్ 5న రాష్ట్రంలో కొత్తగా ఫుడ్ సేఫ్టీ ల్యాబ్స్ ఏర్పాటు చేస్తామని ఆరోగ్య మంత్రి ప్రకటించారని, కానీ ఇప్పటి వరకు ఆ ల్యాబ్స్ ఏర్పాటు చేసే ప్రక్రియ పూర్తికాలేదని తెలిపారు.
ఇతర రాష్ట్రాలతో పోలిక
తెలంగాణలో ఒకే ఒక్క ఫుడ్ సేఫ్టీ ల్యాబొరేటరీ ఉందని, రిపోర్ట్ లు రావడానికి సుమారు 15 నుంచి 20 రోజుల సమయం పడుతోందని తెలిపారు. తమిళనాడులో ఉన్నట్లుగ తెలంగాణలో కూడా ఫుడ్ అడల్టరేషన్ కేసుల కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతి జిల్లాకు కనీసం ఒక ఫాస్ట్ ట్రాక్ ఫుడ్ అడల్టరేషన్ కోర్ట్ ఉండాలన్నారు. దీంతో కేసుల విచారణ వేగంగా జరిగి నేరస్తులకు త్వరగా శిక్షలు విధించడం సాధ్యమవుతుందని అంజిరెడ్డి తెలిపారు.
Also Read: రంగారెడ్డి కాంగ్రెస్లో మార్పు మొదలైందా.. PAC భేటీలో అసలేం జరిగింది?