Congress: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి నిర్మాణాత్మకంగా బలోపేతం చేసే దిశగా అధిష్టానం కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా గురువారం హైదరాబాద్లోని గాంధీభవన్ ప్రాంగణంలో ఉన్న ఇందిరా భవన్లో రంగారెడ్డి జిల్లా పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ (PAC) సమావేశం అత్యంత కీలకంగా సాగింది. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు చల్లా నర్సింహా రెడ్డి అధ్యక్షత వహించి, రాబోయే రోజుల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు.
సమావేశంలో చల్లా నర్సింహా రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై సమగ్ర విశ్లేషణ చేయాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. పార్టీ కోసం ఎండనక, వాననక కష్టపడి పనిచేసే కార్యకర్తలే పార్టీకి అసలైన బలమని, వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత నాయకులపై ఉందన్నారు. ముఖ్యంగా ప్రభుత్వం చేపట్టే నామినేటెడ్ పదవుల భర్తీలో పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.
భవిష్యత్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీని కేడర్ స్థాయిలో పటిష్టం చేయాలని, ఇందుకోసం ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని నాయకులకు సూచించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, సంస్థాగత లోపాలను సరి దిద్దుకుంటూ ముందుకు సాగాలని చర్చించారు.
ఈ కార్యక్రమంలో ఏఐసీసీ సీడబ్ల్యూసీ మెంబెర్ చల్లా వంశీచందర్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణ రెడ్డి, మాల్రెడ్డి రంగారెడ్డి, వీర్లపల్లి శంకర్ పాల్గొన్నారు. వీరితో పాటు మాజీ ఎంపీ మధు యాస్కి, ముఖ్య నాయకులు సిద్దేశ్యర్, రమాకాంత్, జ్ఞానేశ్వర్, దేవరీ సమత, సోనియా దర్శన్, జ్యోతి భీమ్ భరత్, శ్రీను నాయక్ తదితరులు హాజరై జిల్లా రాజకీయ పరిణామాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
Also Read: బ్లడ్ గ్రూప్ కలవకపోయినా కిడ్నీ మార్పిడి సక్సెస్.. యశోద వైద్యుల అద్భుత విజయం!